థానే (మహారాష్ట్ర): వీధి కుక్కలు ఒకరిద్దరిని కరవడం, రాత్రిళ్లు వాహనాల వెంటపడి అరవడం మనం తరచూ చూసే విషయాలు. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్లో ఓ కుక్క కొన్ని గంటల వ్యవధిలో 130 మందిని కాటేసింది. ఫలితంగా పదకొండేళ్ల బాలిక తీవ్రంగా గాయపడి వైద్యసాయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. మరో 25 మంది స్థానిక రుక్మిణీబాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక అధికారులు సోమవారం తెలిపారు.
కుక్కకు రేబిస్ ఉన్నదీ లేదని ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ వ్యవహారమంతా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మొదలైంది. కళ్యాణ్ (వెస్ట్)లోని సందీప్ హోటల్ ప్రాంతంలో ఓ కుక్క ఉన్నట్టుండి అటుపక్క వెళుతున్న పాదాచారులపై దూసుకెళ్లి కరవడం మొదలుపెట్టింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలనూ వెంటపడి తరమడంతోపాటు భౌ భౌమని అరుచుకుంటూ వాటిల్లో ప్రయాణిస్తున్న వారిని కరిచింది. ప్రధాన రహదారితోపాటు చుట్టుపక్కల ఉన్న సందుగొందుల్లోనూ ఈ ‘శూనక విహారం చాలాసేపు కొనసాగింది.
ఈ వ్యవహారంతో స్థానిక బిర్లా కాలేజీ రోడ్, ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్, భోయిర్వాడీ ప్రాంతాల్లో ప్రజలు తలుపులేసుకుని ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆదివారమైనప్పటికీ పిల్లల్ని బయట అడుగుపెట్టనివ్వలేదు. కుక్క కాటుకు గురైన పాతిక మందికి స్థానిక ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తూండగా 11 ఏళ్ల చిన్నారిని మాత్రం ముంబైలోని లోక్మాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి (సియాన్ ఆసుపత్రి)కి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంకాలానికి 110 నుంచి 130 వరకూ కుక్క కాటు కేసులు నమోదైనట్లు రుక్మిణీబాయి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ సందీప్ పగారే తెలిపారు. వీరిలో చాలామందిని ప్రాథమిక చికిత్స తరువాత డిశ్చార్జ్ చేసినట్లు ఆయన చెప్పారు.


