ముంబై: ఓ నెటిజన్ ఆటో డ్రైవర్తో తనకు ఎదురైన హృదయాన్ని హత్తుకునే అనుభవాన్ని పంచుకున్నాడు. పాత ఆటో నడుపుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కనిపించినా, అసలు చార్జీ కంటే రూ.5 కూడా ఎక్కువ తీసుకోవడానికి ఓ డ్రైవర్ నిరాకరించాడు. అతడి స్టోరీని నెటిజన్ రెడిట్లో రాసుకొచ్చాడు.
రెడిట్లో ఇందుకు సంబంధించిన వివరాలను ఆ నెటిజన్ పోస్టు చేశాడు. మహారాష్ట్ర, థానే జిల్లాలో కల్యాణ్ స్టేషన్కు షేర్డ్ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఘటనను వివరించాడు. అదనపు డబ్బు అడగకుండా, నిర్ణయించిన చార్జీ ప్రకారమే ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకుంటున్నట్టు గమనించానని తెలిపాడు.
కష్టాల్లోనూ నిజాయితీ
“ఈ రోజు నా ప్రాంతం నుంచి కల్యాణ్ స్టేషన్కు ఆటోలో వెళ్లాను. నిబంధనల ప్రకారం డ్రైవర్ అంకుల్ నలుగురు ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కరికి చార్జీ రూ.15. ముగ్గురిని మాత్రమే ఎక్కించుకుంటే మాత్రమే రూ.20. దురదృష్టవశాత్తు ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఈ నిబంధన పాటించరు. నలుగురు ఉన్నా రూ.20 వసూలు చేస్తారు” అని రెడిట్ యూజర్ రాశాడు.
నలుగురు కూర్చునే ప్రయాణానికి డ్రైవర్ ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.15 మాత్రమే తీసుకున్నాడని అతడు తెలిపాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి రూ.20 ఇచ్చి, మిగతా రూ.5 డబ్బు ఉంచుకోవాలని చెప్పాడు. అయితే డ్రైవర్ వెంటనే రూ.5 తిరిగి ఇచ్చేశాడు. “ఆ చిన్న చర్య అతను ఎలాంటి వ్యక్తో స్పష్టంగా చూపించింది” అని రెడిట్ యూజర్ పేర్కొన్నాడు.
‘‘ఆటో బాగా పాతదిగా కనిపించింది. భారీ వర్షం పడుతున్నా విండ్షీల్డ్ వైపర్ పనిచేయడం లేదు. భారీ వర్షం పడుతోంది. వైపర్ పనిచేయకపోవడంతో అతను చేతితో అద్దాన్ని తుడుస్తూ వెళ్లాల్సి వచ్చింది” అని రాశాడు.
ఈ ఘటనపై ఆలోచిస్తూ, “అంత నిజాయితీగా, విలువలతో జీవించే వ్యక్తి ఇలాంటి కష్టాల్లో ఉండటం చూసి ఒక ప్రశ్న వచ్చింది. మంచి వాళ్లే ఎందుకు ఎక్కువగా బాధలు పడుతున్నట్టు కనిపిస్తారు? అతను రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా సంపాదిస్తున్నట్టే కనిపించింది. అయినా కొన్ని అదనపు రూపాయల కంటే నిజాయితీకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇది నిజంగా నన్ను బాధపెట్టింది. మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ రోజుల్లో నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి వస్తుందా?” అని ప్రశ్నించాడు. ఈ పోస్టును “నిజాయితీ మీ దగ్గర ఉన్నదంతా కోల్పోయేలా చేస్తుందా?” అనే శీర్షికతో పంచుకున్నాడు.
Being honest can cost you everything?
by u/Guilty-Kick-5617 in mumbai


