మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్లు, యువకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుని.. వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్లో 600కుపైగా అశ్లీల వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైజింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాశ్ కోలి (22).. 2022 నుంచి మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డబ్బులు ఇస్తానని నమ్మించి బాధితులను ఆకర్షించిన నిందితుడు.. వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయని నందుర్బార్ ఎస్పీ అశ్విని సనప్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్లు తెలిపారు. వీడియోల్లో ఉన్న బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు 2022 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.


