టీసీఎస్‌ నిదా ఖాన్‌ కేసు.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్‌ | Ex TCS Nida Khan Case AIMIM Corporator matin Patel Arrested | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ నిదా ఖాన్‌ కేసు.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్‌

Aug 7 2026 9:23 AM | Updated on Aug 7 2026 9:23 AM

Ex TCS Nida Khan Case AIMIM Corporator matin Patel Arrested

ముంబై: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మతమార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలైన మాజీ టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి మతీన్‌ పటేల్‌కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో పోలీసులు మతీన్ పటేల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం నాసిక్‌కు తరలించారు. అదే సమయంలో అధికారులు మతీన్ పటేల్ నివాసం, కార్యాలయాలపై బుల్డోజర్ చర్యలు కూడా ప్రారంభించారు. అతడి నివాసం, ఆఫీసును నేలమట్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీసీఎస్ కేసు ఇదే.. 
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ కార్యాలయంలో పనిచేసిన నిదా ఖాన్‌పై మతమార్పిడి, మానసిక వేధింపులు, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఆమె పేరు కేసులో వెలుగులోకి రావడంతో టీసీఎస్ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ కేసు 2022లో ప్రారంభమైన ఘటనతో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ తన సహోద్యోగి దానిష్ షేక్ పెళ్లి చేస్తానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అయితే అప్పటికే అతడికి మరో మహిళతో వివాహం జరిగిన విషయం తర్వాత తెలిసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల దర్యాప్తులో దానిష్ షేక్ సోదరి నిదా ఖాన్ బాధితురాలిని మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు, ఆమె మతాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. అంతేకాకుండా బాధితురాలికి బుర్ఖా, ఇస్లామిక్ మత గ్రంథాలు అందించడం, మొబైల్ ఫోన్‌లో ఇస్లాం సంబంధిత యాప్‌లు ఇన్‌స్టాల్ చేయించడం, ఇంటికి వెళ్లి నమాజ్ చేసే విధానం నేర్పించడం, హిజాబ్ ధరించేలా ప్రోత్సహించడం వంటి ఆరోపణలను పోలీసులు తమ దర్యాప్తులో నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మహిళా ఉద్యోగులపై బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు తదితర అంశాలపై మొత్తం తొమ్మిది కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుమారు 25 రోజులపాటు పరారీలో ఉన్న నిదా ఖాన్‌ను ఈ ఏడాది మే 7న ఛత్రపతి సంభాజీనగర్‌లోని అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం తాను గర్భవతినని పేర్కొంటూ బెయిల్ కోరగా, ప్రసవ సమయంలో జైలులో ఉండటం ఏ మహిళకైనా తీవ్రమైన మానసిక వేదన కలిగిస్తుందని వ్యాఖ్యానించిన నాసిక్ కోర్టు గత నెల ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను టీసీఎస్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు, బలవంతం, వివక్షను సహించబోమని, సంస్థలో ఇటువంటి చర్యలపై జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉందని టీసీఎస్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement