సాక్షి, ఢిల్లీ: ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. చేనేత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఆ వీడియోలను చేనేత కార్మికులకు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్నేహితుల దినోత్సవంఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో, అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరారు.
ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని, దేశ ప్రజలను ఏకం చేయడంతో పాటు స్వావలంబనకు ప్రతీకగా నిలిచింది" అని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం కూడా అదే స్పూర్తిని గుర్తు చేసే సందర్భంగా భావించాలని ప్రధాని అన్నారు.
దేశవ్యాప్తంగా అనేక మంది నేత కార్మికులు చిన్న చిన్న ఇళ్లలోనే పనిచేస్తూ, విభిన్న రకాల చేనేత వస్త్రాలను అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక హ్యాండ్లూమ్ ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, దానిని చూపిస్తూ ఒక చిన్న వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
ఇలా చేయడం ద్వారా మరింత మంది చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రేరణ పొందుతారని, నేత కార్మికులకు విస్తృత మద్దతు లభిస్తుందని ఆయన చెప్పారు. "ఆత్మనిర్భర్ భారత్ నిర్మించడమే మన లక్ష్యమని. అందుకోసం సమాజంలోని అత్యంత చిన్న, పేద కుటుంబాలు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి. ప్రజల మద్దతు పెరిగితే భారతీయ నేత కార్మికుల ప్రతిభ, వారి అద్భుతమైన కళాత్మక నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందుతుంది” అని ప్రధాని మోదీ ఇన్స్టా వేదికగా పేర్కొన్నారు.


