ఒక తండ్రి... కన్న బిడ్డలను అల్లారుముద్దుగా పెంచాడు. తన రెక్కలు ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడి సంపాదించాడు. వారిని గొప్పగా చదివించి, ఉన్నత స్థానాల్లో నిలబెట్టాడు. కానీ చివరికి తన జీవిత ప్రయాణం ముగిసే సమయానికి ఆయన పక్కన నిలిచింది మాత్రం ఆ కుటుంబం కాదు... ఓ వృద్ధాశ్రమం.
హరియాణాలోని సోనిపట్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త చివరి రోజులు ఒంటరితనంతో గడిపారు. జీవితమంతా కుటుంబం కోసం శ్రమించిన ఆయన, చివరికి వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే? ఆయన అంత్యక్రియలకు సొంత కుమార్తెలు కూడా రాలేదు.
వీడియో కాల్ పెట్టండి...
కన్నతండ్రి మరణించారని తెలుసుకున్న కుమార్తెలు కడసారి చూపుకైనా రాలేకపోయారు. తండ్రి చివరి ప్రయాణాన్ని వీడీయో కాల్రూపంలో మొబైల్ స్క్రీన్లో చూసేశారు. అలోచిస్తేనే బాధతో గుండెభారంగా మారుతున్న ఈ ఘటనలో.. చివరికి వారు తండ్రి అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5,100 పంపించి తమ బాధ్యత ముగిసిందని భావించినట్లుగా ఈ వీడియోలో వారి సన్నివేశం కనిపిస్తోంది. అయితే, ఈ సంఘటన ప్రస్తుతం ఒక ప్రశ్నగా మారి సమాజం ముందు నిలబెడుతోంది.
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే… pic.twitter.com/CCMMyqFMhl— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 5, 2026
సాంకేతికత మనుషులనే కాకుండా.. పూర్తిగా మనసులను మరింత దూరం చేసింది. ఎన్ని కోట్లు సంపాదించినా... ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా... తల్లిదండ్రుల చివరి క్షణాల్లో వారి పక్కన నిలబడలేకపోతే ఆ విజయం విలువ ఏమిటి? జీవితాంతం మన కోసం కష్టపడిన వాళ్లకు చివరి వీడ్కోలు కూడా ఇవ్వలేకపోతే అది అభివృద్ధా? లేక అనుబంధాల ఓటమా? అనే ఆలోచనలు ఇలాంటి ఘటనలు పదే పదే గుర్తు చేస్తున్నాయి.
వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి... వీడియో కాల్స్, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు పెరుగుతున్నాయి... కానీ ఆప్యాయత, మమకారం, బాధ్యత కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయా అనే ప్రశ్న కూడా వెంటాడుతోంది. తల్లిదండ్రులు కోరుకునేది కోట్ల ఆస్తులు కాదు... వద్దాప్య చివరి రోజుల్లో నాలుగు ఓదార్పు మాటలు, పక్కన నిలిచే సొంత మనుషులు మాత్రమే. ఒకప్పుడు పిల్లల కోసం తమ జీవితాన్నే అంకితం చేసిన తల్లిదండ్రులు... నేడు వృద్ధాశ్రమాల్లో ఒంటరిగా కన్నుమూయాల్సి వస్తే, అది ఒక్క కుటుంబం వైఫల్యం మాత్రమే కాదు... సమాజమంతా ఆలోచించాల్సిన అంశం కూడా.


