ఒక నాయకుడి అసలైన బలం.. జనం. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ పర్యటనకు వెళ్లినా ప్రజా స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటుంది. జగన్ పర్యటనలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ముందుంచి ఆంక్షలు విధిస్తోంది. అయితే, ప్రతిసారీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ ప్రయత్నాలకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన మరోసారి ఇదే చర్చకు వేదికైంది. గత రెండేళ్లుగా.. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు జగన్ దేవరపల్లి పర్యటన చేపట్టారు. రైతులను పరామర్శించడంతో పాటు పొగాకు యార్డ్ను పరిశీలించనున్నారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. జనసందోహం మాత్రం తగ్గలేదు.

బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు, నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ జగన్ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్ల వెంట, పర్యటన మార్గాల్లో జనం బారులు తీరడం కనిపించింది. ఈ క్రమంలో..

ఓ మహిళ ప్రదర్శించిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. “ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు” అంటూ జగన్ చిత్రాన్ని చూపించడం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. చుట్టుపక్కల మహిళలు, కార్యకర్తలు ఆ ఫొటోను పైకి ఎత్తి పట్టుకోగా.. పలువరు ఆ ఫొటోతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అదే సమయంలో.. రాసిపెట్టుకోండి 2029లో జగనే సీఎం, వైఎస్ జగన్ మా దేవుడు అంటూ కొందరు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తమ నాయకుడిపై ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ పర్యటనలపై ప్రభుత్వం గత రెండేళ్లుగా ఆంక్షలు విధిస్తోంది. కేసులు పెడతామని నేతలను, ఆ వైపు వెళ్లనీయకుండా సాధారణ ప్రజలను ఇబ్బండి పెడుతోంది. అదేసమయంలో సరైన భద్రత కల్పించకుండా.. డ్రామాలు ఆడుతోంది. అయితే బారికేడ్లు, ఫెన్సింగ్లు ఏర్పాటు చేసినా ప్రజల అభిమానం మాత్రం తగ్గడం లేదు. రాజకీయంగా చూస్తే.. ప్రతి పర్యటనలోనూ కనిపిస్తున్న జన స్పందన వైఎస్సార్సీపీకి బలాన్ని చేకూరుస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నాయకుడిపై అభిమానం ఉంటే జనాలు స్వచ్ఛందంగా తరలివస్తారనే వాదనకు జగన్ పర్యటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.


