తూర్పుగోదావరి: మండలంలోని పెరుమాళ్లపురంలో ఓ కారు రెండు బైకులను ఢీకొట్టి బీభత్సం సృష్టించిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజమహేంద్రవరం వద్ద బొమ్మూరుకు చెందిన విప్పర్తి మాధవికి తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ బుచ్చియ్యపేట గ్రామానికి చెందిన అంబుజాలపు బాబ్జీ తన స్నేహితురాలి ద్వారా కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.
మూడేళ్ల క్రితం బాబ్జీ మాధవి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారు కాకినాడలో నాలుగు నెలలుగా ఉంటున్నారు. సోమవారం రాత్రి బాబ్జీ కాకినాడ నుంచి తనకు చెప్పకుండా వచ్చేయడంతో మంగళవారం ఉదయం మాధవి బుచ్చియ్యపేటకు తన కారులో వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి కారును సైతం ధ్వంసం చేశారు. దీంతో ఆమె ప్రాణభయంతో కారుతో అతివేగంగా రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది.
కారు అద్దాలు పగిలిపోవడం, దారి స్పష్టంగా లేకపోవడంతో పెరుమాళ్లపురం మెయిన్ సెంటర్లో రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యయి. దీంతో స్థానికులు కారును అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మాధవి తనపై జరిగిన దాడిపై ఇచ్చిన ఫిర్యాదుపైనా, కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారు ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


