UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది | Delhi woman reveals how cash changed her spending habits | Sakshi
Sakshi News home page

UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది

Aug 3 2026 6:35 PM | Updated on Aug 3 2026 6:49 PM

Delhi woman reveals how cash changed her spending habits

న్యూఢిల్లీ: డిజిటల్ విప్లవం వచ్చాక రూపాయి చాక్లెట్ కొనాలన్నా.. వేల రూపాయల షాపింగ్ చేయాలన్నా అందరం ‘యూపీఐ’నే వినియోగిస్తున్నాం. అయితే, ఈ డిజిటల్ చెల్లింపుల వల్ల పర్సు ఖాళీ అవ్వడం లేదు కానీ.. బ్యాంక్ బ్యాలెన్స్‌ ఇట్టే కరిగిపోతోంది. సరిగ్గా ఇదే సమస్యను గమనించిన ఢిల్లీకి చెందిన ‘సదఫ్’ అనే యువతి ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంది.

గత మూడు నెలలుగా ఆమె యూపీఐ వాడకాన్ని దాదాపు నిలిపివేసి, పాత పద్ధతిలో కేవలం నగదు మాత్రమే వాడుతోంది. దీంతో దెబ్బకు తన దశ తిరిగినట్లు చెప్పుకొచ్చింది.తన ఆర్థిక జీవితంలో వచ్చిన మార్పులను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

చేతితో డబ్బులు ఇస్తుంటే ఆ నొప్పి తెలుస్తోంది!తన అనుభవాన్ని పంచుకుంటూ.. గత ఆరు నెలల్లో తాను సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని సదఫ్ పేర్కొంది. యూపీఐ ఉన్నప్పుడు రూ. 50, రూ. 100 చొప్పున ఐదారు సార్లు ఈజీగా స్కాన్ చేసేస్తాం. అది పెద్ద మొత్తంగా అనిపించదు. తీరా చూస్తే రోజు ముగిసేసరికి తెలియకుండానే రూ. 1,000 ఖర్చయిపోతుంది.

కానీ, వాలెట్ నుండి రూ.500 నోటు తీసి అవతలి వ్యక్తికి ఇచ్చేటప్పుడు డబ్బు మన చేతిలోంచి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. నా చేతిలో ఎంత ఉంది, ఎంత ఖర్చయింది అనేది స్పష్టంగా కళ్లముందు కనిపిస్తుంది. ఈ ఒక్క మార్పు నా అనవసరపు ఖర్చులను పూర్తిగా అడ్డుకుంది అని ఆమె వివరించింది.

అయితే ఈ రోజుల్లో వంద శాతం యూపీఐ లేకుండా బతకడం ప్రాక్టికల్ కాదు కాబట్టి, ఆమె ఒక కొత్త పద్ధతిని పాటిస్తోంది. రోజువారీ అవసరాలన్నింటికీ 80శాతం కేవలం చేతిలోని నగదునే వాడుతుంది. చిల్లర సమస్య ఉన్నప్పుడు, లేదా క్యాష్ తీసుకోవడానికి షాపుల వారు నిరాకరించినప్పుడు మాత్రమే 20శాతం యూపీఐ వాడుతుంది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చాలా మంది ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిజమే.. బ్యాంక్ అకౌంట్ చూస్తే డబ్బులు మాయమవుతున్నాయి కానీ.. పర్సులో పెడితే మాత్రం అలాగే ఉంటున్నాయి’ అని ఒక యూజర్‌ అంటుంటే మధ్యలో అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయనే వార్తల వల్ల నేను కూడా యూపీఐ తగ్గించాను అని మరొకరు పేర్కొన్నారు.

ఇప్పుడు చాలా మంది వ్యాపారులు, మాల్స్ వాళ్లు రూ. 5, రూ. 10 చిల్లర ఇవ్వడం లేదు. చిల్లర దొరకడమే పెద్ద టాస్క్ అయిపోయింది’అని కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. సమస్యలు ఎలా ఉన్నా, డిజిటల్ యుగంలో క్రేజీగా ఖర్చు పెట్టే ఈ తరానికి.. ఈ ఢిల్లీ యువతి ఐడియా మాత్రం ఒక మంచి ఆర్థిక పాఠం అని చెప్పక తప్పదు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement