దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా యూపీఐ (UPI) ద్వారా క్షణాల్లో డబ్బులు పంపడం, స్వీకరించడం చాలా సులభమైపోయింది. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు బ్యాంకులు కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాయి.
అనుమానాస్పదంగా కనిపించే కొన్ని యూపీఐ చెల్లింపులకు అదనపు నిర్ధారణ తీసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. అంటే.. ఒక లావాదేవీ సాధారణంగా లేదని బ్యాంకు మోసాల గుర్తింపు వ్యవస్థ గుర్తిస్తే.. వినియోగదారుడి ఫోన్లో ''మీరు ఈ చెల్లింపును కొనసాగించాలనుకుంటున్నారా?'' అనే సందేశం కనిపిస్తుంది. వినియోగదారు 'Yes' అని అంగీకరించిన తర్వాత మాత్రమే ఆ చెల్లింపు పూర్తవుతుంది.
అయితే.. ఈ విధానం ప్రతి యూపీఐ చెల్లింపునకు వర్తించదు. సాధారణంగా జరిగే లావాదేవీలకు ఎలాంటి మార్పు ఉండదు. బ్యాంకు వ్యవస్థలో ఏదైనా అనుమానాస్పద అంశం గుర్తించినప్పుడు మాత్రమే.. ఈ అదనపు నిర్ధారణ అడుగుతారు. దీని వల్ల వినియోగదారులు డబ్బు పంపే ముందు ఒకసారి ఆలోచించే అవకాశం పొందుతారు.
అంతే కాకుండా.. ప్రతి పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ చెల్లింపులకు తప్పనిసరిగా కొంత టైమ్ పెట్టాలనే సూచనలను బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. అలా చేస్తే.. యూపీఐకి ఉన్న వేగం, సులభతరం అనే ప్రధాన ప్రయోజనాలు తగ్గిపోతాయని అవి భావిస్తున్నాయి. అందుకే అన్ని లావాదేవీలకు కాకుండా, ప్రమాదం ఉన్న వాటికే అదనపు తనిఖీ ఉండాలని బ్యాంకులు కోరుతున్నాయి.
యూపీఐ మోసాలు పెరగడానికి కారణాలు
యూపీఐ మోసాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మోసగాళ్లు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా ప్రజలను నమ్మించి డబ్బులు పంపించేలా చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులు వెంటనే పూర్తవుతుండటంతో, మోసాన్ని గుర్తించేలోపే డబ్బు ఇతర ఖాతాలకు వెళ్లిపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో చెల్లింపునకు ముందు వచ్చే చిన్న నిర్ధారణ సందేశం వినియోగదారులకు జాగ్రత్తపడే అవకాశం ఇస్తుందని బ్యాంకులు భావిస్తున్నాయి. డబ్బు పంపే ముందు లావాదేవీ వివరాలను మరోసారి పరిశీలించుకోవడం ద్వారా మోసాలను నివారించవచ్చని చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలనలో ఉంది. డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచుతూ, యూపీఐ వేగం మరియు సౌకర్యాన్ని కొనసాగించేలా కొత్త నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 19 ఏళ్ల యువతి కథ.. శ్రీధర్ వెంబు భావోద్వేగం!


