రోజుకు రూ.96,383 కోట్లు.. క్యాష్‌ కాదు! | UPI Transactions Record High July 2026 FASTag Transactions Decline | Sakshi
Sakshi News home page

రోజుకు రూ.96,383 కోట్లు.. క్యాష్‌ కాదు!

Aug 2 2026 12:02 PM | Updated on Aug 2 2026 12:53 PM

UPI Transactions Record High July 2026 FASTag Transactions Decline

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) జూలైలో కొత్త రికార్డు సృష్టించింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం.. జూలైలో యూపీఐ ద్వారా 2,366 కోట్ల లావాదేవీలు జరిగాయి. జూన్‌లో నమోదైన 2,272 కోట్లతో పోలిస్తే ఇది 4.1 శాతం అధికం. గతేడాది జూలైతో పోలిస్తే లావాదేవీల సంఖ్య ఏకంగా 22 శాతం పెరిగింది.

లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగింది. జూన్‌లో రూ.28.92 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల విలువ.. జూలైలో రూ.29.88 లక్షల కోట్లకు చేరింది. నెలవారీగా ఇది 3.3 శాతం వృద్ధి. అయితే మేలో నమోదైన రూ.29.90 లక్షల కోట్ల రికార్డుతో పోలిస్తే జూలై విలువ స్వల్పంగా తక్కువగానే ఉంది. అంటే జూలైలో లావాదేవీల సంఖ్య మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరగా, విలువలో కొత్త రికార్డు నమోదు కాలేదు.

జూలైలో యూపీఐ రోజుకు సగటున 76.3 కోట్ల లావాదేవీలను ప్రాసెస్‌ చేసింది. జూన్‌లో ఈ సగటు 75.7 కోట్లుగా ఉంది. రోజువారీ లావాదేవీల సగటు విలువ రూ.96,383 కోట్లుగా నమోదైంది. జూన్‌లోని రూ.96,405 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు స్థిరంగానే ఉంది.

ఫాస్టాగ్‌ లావాదేవీలకు బ్రేక్‌

మరోవైపు, ఎన్‌ఈటీసీ ఫాస్టాగ్‌ లావాదేవీల్లో తగ్గుదల కనిపించింది. జూలైలో 34.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. జూన్‌లోని 36.2 కోట్లతో పోలిస్తే 4.1 శాతం తగ్గాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 6 శాతం క్షీణత నమోదైంది. ఫాస్టాగ్‌ లావాదేవీల విలువ కూడా స్వల్పంగా తగ్గింది. జూన్‌లో రూ.7,215 కోట్లుగా ఉన్న విలువ.. జూలైలో రూ.7,143 కోట్లకు పడిపోయింది. మేలో నమోదైన రూ.7,308 కోట్లతో పోల్చినా ఇది తక్కువే.

ఫాస్టాగ్‌ వినియోగంలో ఈ మార్పు నేపథ్యంలో, కేంద్రం అమలు చేస్తున్న వార్షిక పాస్‌ పథకం కూడా కీలకంగా మారింది. 2026-27లో రూ.3,075 చెల్లించి పొందే వార్షిక పాస్‌తో నేషనల్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్‌ ప్లాజాల వద్ద ఏడాదిలో 200 సార్లు లేదా ఒక సంవత్సరం వరకు ప్రయాణించే అవకాశం ఉంది. జూన్‌ 2026 నాటికి 77 లక్షలకు పైగా వార్షిక పాస్‌లు జారీ కాగా, ఇవి 63 కోట్ల టోల్‌ లావాదేవీలకు దోహదపడ్డాయని కేంద్రం తెలిపింది.

ఇక యూపీఐ విస్తరణ కూడా వేగంగా కొనసాగుతోంది. జూన్‌ 2026 నాటికి దేశంలో 55.49 కోట్ల మంది యూజర్లు యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై నమోదయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. విదేశాల్లోనూ యూపీఐ వినియోగం విస్తరిస్తోంది. గ్రీస్, నేపాల్‌ వంటి దేశాల్లో కొత్త అనుసంధానాలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: బంగారం, వెండి‌ ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement