EPFOకు రూ.1,816 కోట్ల నష్టం.. అనిల్‌ అంబానీపై కేసు | Anil Ambani CBI FIR Rs 1816 Crore EPFO Loss Reliance Capital case | Sakshi
Sakshi News home page

EPFOకు రూ.1,816 కోట్ల నష్టం.. అనిల్‌ అంబానీపై కేసు

Aug 2 2026 9:16 AM | Updated on Aug 2 2026 9:25 AM

Anil Ambani CBI FIR Rs 1816 Crore EPFO Loss Reliance Capital case

రిలయన్స్‌ ఏడీఏ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎల్‌) మాజీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ, సంస్థకు చెందిన ఇతర వ్యక్తులు, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)కు సుమారు రూ.1,816 కోట్ల నష్టం వాటిల్లేలా మోసపూరిత లావాదేవీలు, నిధుల మళ్లింపు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో సుమారు రూ.1,007 కోట్ల మూలధనం, రూ.808.67 కోట్ల వడ్డీ మొత్తాలు సమస్యలో ఉన్నట్లు పేర్కొన్నారు.

రూ.2,500 కోట్లను పెట్టుబడి పెట్టిన ఈపీఎఫ్‌ఓ

ఫిర్యాదు ప్రకారం.. రిలయన్స్‌ క్యాపిటల్‌ 2013, 2014 సంవత్సరాల్లో సెక్యూర్డ్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) జారీ చేసింది. వీటిలో ఈపీఎఫ్‌ఓ తన నిధుల నుంచి మొత్తం రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులను నాలుగు పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ద్వారా నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎన్‌సీడీల్లో కొన్నింటి మెచ్యూరిటీ 2023, 2024లో ఉండగా, రిలయన్స్‌ క్యాపిటల్‌ తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైంది. ఫలితంగా ఈపీఎఫ్‌ఓకు భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి.

నిధుల మళ్లింపుపై ఆరోపణలు

రిలయన్స్‌ క్యాపిటల్‌ నుంచి నిధులు ఇతర లావాదేవీలకు మళ్లించేందుకు మోసపూరిత మార్గాలను ఉపయోగించారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ లావాదేవీలే ఎన్‌సీడీలను తిరిగి చెల్లించడంలో సంస్థ డిఫాల్ట్‌కు దారితీశాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు సహా ఎవరెవరి పాత్ర ఉందో గుర్తించడం, నిధులను ఏ విధంగా ఉపయోగించారో తేల్చడం, పెట్టుబడి మొత్తాల తుది వినియోగాన్ని నిర్ధారించడం తమ దర్యాప్తులో ప్రధాన అంశాలని సీబీఐ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement