ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) దశాబ్దాలుగా క్లెయిమ్ కాకుండా పడివున్న చందాదారుల డబ్బును నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏళ్ల తరబడి నిద్రాణంగా (ఇన్ఆపరేటివ్) ఉండి రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలలో ఇప్పటికే 1.18 లక్షల ఖాతాదారుల బ్యాంకు వివరాలను ఆధార్ డేటాతో అనుసంధానించి ధ్రువీకరించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈపీఎఫ్ఓ 2.0 సంస్కరణల్లో భాగంగా ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చందాదారులు ఎలాంటి దరఖాస్తులు లేదా క్లెయిమ్ ఫారాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే వడ్డీతో సహా వారి సొమ్ము బ్యాంకు ఖాతాల్లోకి ఆటో-క్రెడిట్ కానుంది.
సీ-డాక్ సాఫ్ట్వేర్
రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న 7.11 లక్షల ఖాతాల్లో మొత్తం రూ.30.52 కోట్ల సొమ్ము ఆమోదం లేకుండా పడి ఉంది. ఈ భారీ ప్రక్రియ కోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘సీ-డాక్’ సంస్థ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను రూపొందిస్తోంది. సాధారణంగా ఈపీఎఫ్ఓ వ్యవస్థ సభ్యులు క్లెయిమ్ చేస్తేనే స్పందిస్తుంది. కానీ ఈ విధానంలో సభ్యుల ప్రమేయం లేకుండానే సిస్టమ్ జనరేటెడ్ క్లెయిమ్ సదుపాయాన్ని సీ-డాక్ అభివృద్ధి చేస్తోంది.
బ్యాంక్ ఖాతాల ధ్రువీకరణలో భాగంగా ‘పెన్నీ డ్రాప్’ విధానాన్ని అమలు చేయగా మరణించిన ఖాతాదారుల వివరాలు కూడా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్ట్, ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
భవిష్యత్తు ప్రణాళికలు.. మానవ ప్రమేయానికి స్వస్తి
ఈ మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత రూ.1,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మిగిలిన 24.76 లక్షల మంది చందాదారులకు కూడా ఇదే రీతిలో ఆటో రిఫండ్ ప్రక్రియను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలుగా దాదాపు 31.86 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.10,903 కోట్ల నిధులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. 2014లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయింపుతో ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రక్షాళన, కార్మికులు తమ సొంత డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సులభతరమైన సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఇదీ చదవండి: చిన్న రవాణాదారుల మనుగడ ప్రశ్నార్థకం


