వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తపరిచిన అభ్యంతరాలను స్పష్టంగా తోసిపుచ్చారు. అమెరికా రక్షణ సామగ్రి విక్రయాలను ఏ విదేశీ నాయకుడూ శాసించలేరని ఆయన తేల్చిచెప్పారు. సోమవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ, వాషింగ్టన్ రక్షణ రంగ విక్రయాలపై ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మేము ఏది విక్రయించాలో ఎవరూ మాకు చెప్పలేరు’ అని స్పష్టం చేశారు.
టర్కీ ఒక అద్భుతమైన మిత్రదేశమని, సిరియాతో సహా ప్రాంతీయ వ్యవహారాలలో అంకారా పాత్ర ఎంతో కీలకమని ట్రంప్ ప్రశంసించారు. టర్కీ, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు లేనప్పటికీ, అమెరికా-టర్కీ బంధం బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అధునాతన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను టర్కీకి అందించడం వల్ల మధ్యప్రాచ్యంలో అధికార సమీకరణాలు మారుతాయని, ఆ దేశానికి ఈ సాంకేతికత ఇస్తే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని నెతన్యాహు ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో హెచ్చరించిన విషయం తెలిసిందే. టర్కీకి దురాక్రమణ పూరిత ఆశయాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన కారణంగా, ట్రంప్ మొదటి హయాంలోనే 2019లో టర్కీని ఎఫ్-35 ఉమ్మడి ప్రాజెక్ట్ నుంచి అమెరికా తప్పించింది. నాటో భద్రతా ఆందోళనల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, తాజా పరిణామాలు అంకారాతో రక్షణ రంగ సహకారాన్ని పునరుద్ధరించడానికి ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ భయాందోళనలను పక్కనపెట్టి, అమెరికా అధ్యక్షుడి ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇది కూడా చదవండి: అస్సాం: నీటిలో 631 గ్రామాలు.. 4.45 లక్షల మంది విలవిల


