అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కాస్త చల్లబడుతున్న వేళ.. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు మూడు రోజులుగా నిలిచిపోవడంతో చర్చలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అయితే దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తిరిగి సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు.
‘‘ఇరాన్తో మంచి చర్చలు జరుగుతున్నాయి. ఏదో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’’ అని ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే చర్చలు ఫలించకపోతే గతంలో చేపట్టిన చర్యలను తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే అది అందరికీ మంచిదేనని పేర్కొన్న ఆయన.. అమెరికా ప్రయోజనాలు, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.
ప్రత్యక్ష చర్చలు లేవంటున్న ఇరాన్
అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి కొన్ని సందేశాలు అందుతున్నాయని, కానీ ప్రస్తుతం అధికారిక చర్చలు మాత్రం లేవని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా దాడులతో ఇరాన్లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుబంధ లక్ష్యాలపై దాడులు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తిగా మారింది.
‘అమెరికా ఆయుధ నిల్వలు తగ్గలేదు’.. ట్రంప్
ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్యలకు అమెరికా వద్ద క్షిపణులు, ఆయుధ నిల్వలు సరిపోవడం లేదన్న వార్తలను ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని, అవసరానికి మించి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత బైడెన్ ప్రభుత్వ హయాంలో ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు పంపడం వల్ల నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
సౌదీ చమురు స్థావరాలపై డ్రోన్ దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు కారణమని సౌదీ ఆరోపించింది. మరోవైపు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ చమురు మౌలిక వసతులపై దాడులు చేసినట్లు ప్రకటించారు. అయితే దీనిపై సౌదీ నుంచి అధికారిక స్పందన రాలేదు.
హర్ముజ్ జలసంధిపైనే అసలు పంచాయితీ
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. ఈ మార్గంపై నియంత్రణ తమదేనని ఇరాన్ చెబుతుండగా.. నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటీవల ఈ మార్గంలో ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. అయితే తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఉపశమనం కనిపించింది.
చర్చలా? దాడులా? ఉత్కంఠ కొనసాగింపు
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు కనిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల ప్రకటనల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తూనే.. మరోవైపు సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు రావడం మిడిల్ఈస్ట్ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.
ట్రంప్ మాటల్లో శాంతి సంకేతాలు కనిపిస్తున్నా.. హర్ముజ్ జలసంధి, ఆయుధ నిల్వలు, ప్రాంతీయ దాడులు ఈ ఒప్పందానికి అసలు పరీక్షగా మారనున్నాయి.


