పలువురు భారతీయులు సహా 19 మంది అరెస్ట్
ఒంటారియో: కెనడాలోని ఒంటారియోలో రికార్డు స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అధికారులు రూ.930 కోట్ల విలువైన 1.7 టన్నుల డ్రగ్స్ను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి 19 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో అత్యధికులు భారతసంతతి వారే కావడం గమనార్హం. కెనడాలోకి డ్రగ్స్ను తరలించే అతిపెద్ద అంతర్జాతీయ రాకెట్ను తాము భగ్నం చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు.
అమెరికా–కెనడా సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించిన వారిలో ఎక్కువ మంది ట్రక్కు డ్రైవర్లేనని వివరించారు. ప్రాజెక్టు బే పేరుతో 2025 జనవరి నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్లో 973 కిలోల కొకైన్, 660 కిలోల మెథాంఫెటమైన్, 49 కిలోల నల్లమందు, 230 కిలోల ఆక్సీకొడోన్ టాబ్లెట్లు ఉన్నాయి. ఇంకా 17 తుపాకులు, 80 వేల కెనడా డాలర్లు, 10 వేల అమెరికా డాలర్లు, ఖరీదైన నగలు, 43 సెల్ఫోన్లు, ఆరు ల్యాప్టాప్లు, ఒక వాహనాన్ని కూడా స్వా«దీనం చేసుకున్నారు.


