సౌదీ రాజకుటుంబంలో నెలకొన్న డెత్ మిస్టరీ దాదాపుగా వీడింది. లండన్లోని ఓ విలాసవంతమైన హోటల్లో గతేడాది చివర్లో సౌదీ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫహాద్ అల్ సౌద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన గుండె ఆగిపోవడంతోనే మరణించారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. మృతికి గల కారణాలపై ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది.
మద్యం పార్టీలో డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ సేవించడం.. అది ఓవర్డోస్ కావడం వల్లే అతను చనిపోయినట్లు బ్రిటన్ కోర్టు విచారణలో వెల్లడి కావడం కలకలం రేపుతోంది. 29 ఏళ్ల సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహాద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ బిన్ జలావి అల్ సౌద్.. లండన్లోని కెన్సింగ్టన్ ప్రాంతంలోని మారియట్ హోటల్లో నవంబర్ 25న మృతి చెందారు. రాజకుటుంబం కావడంతో.. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు జరిపారు. దీంతో విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.
హోటల్ గదిలో చివరి క్షణాలు..
వారానికి పైగా ఉండేందుకు నవంబర్ 19న ఆయన హోటల్లో దిగినట్లు విచారణలో తేలింది. మరణానికి ముందు రోజు రాత్రి యువరాజు సిగరెట్ తాగేందుకు హోటల్ బయటకు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన గదికే వెళ్లిపోయారు. మరుసటి రోజు హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. బాత్రూమ్లో ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించినా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మద్యం, డ్రగ్స్ కలయికే కారణమా?
మరణంపై నిర్వహించిన టాక్సికాలజీ పరీక్షల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. యువరాజు రక్తంలో మద్యం స్థాయి అత్యంత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అది ఒక్కటే ప్రమాదకర స్థాయిలో ఉందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా పార్టీ డ్రగ్గా పిలిచే గామా హైడ్రాక్సీబ్యూటిరేట్ (GHB), గంజాయి ఆనవాళ్లు, ఆందోళన తగ్గించే మందుల అవశేషాలు కూడా గుర్తించారు. వీటి కలయిక వల్ల గుండె ఆగిపోయి మరణం సంభవించినట్లు వైద్య నిపుణులు కోర్టుకు తెలిపారు.
గతంలోనూ వ్యసన సమస్యలు
యువరాజు అబ్దుల్లా గతంలో మద్యం, కొన్ని ప్రిస్క్రిప్షన్ మందులపై ఆధారపడే సమస్యతో చికిత్స పొందినట్లు విచారణలో వెల్లడైంది. 2025లో బ్రిటన్లోని ఓ డీ-అడిక్షన్ క్లినిక్లో చేరి చికిత్స తీసుకున్నారని, అక్కడ డీటాక్స్ కార్యక్రమాన్ని పూర్తి చేశారని వైద్యులు తెలిపారు. అయితే చికిత్స అనంతరం నిర్ణీత ఫాలోఅప్ అపాయింట్మెంట్లకు హాజరు కాలేదని చెప్పారు.
ఆత్మహత్య కాదు.. ప్రమాదవశాత్తు మరణం
ఈ ఘటనపై విచారణ జరిపిన అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్.. యువరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సూసైడ్ నోట్ కూడా లభించలేదని, మూడో వ్యక్తి ప్రమేయానికి ఆధారాలు కనిపించలేదని తెలిపారు. మత్తు పదార్థాల మిశ్రమ ప్రభావంతో జరిగిన “ప్రమాదవశాత్తు మరణం” (Death by misadventure) గా తీర్పు నమోదు చేశారు.
రాజకుటుంబంలో విషాదం
సౌదీ రాజదర్బార్ కూడా యువరాజు అబ్దుల్లా మృతిని అధికారికంగా ధ్రువీకరించింది. రియాద్లోని వీఐపీ ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాజకుటుంబానికి చెందిన యువరాజు.. లండన్ లగ్జరీ హోటల్లో ఇలా విషాదాంతం చెందడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.


