అందరి సలహాలూ బేఖాతరు చేసి ఇరాన్పై యుద్ధ భేరి మోగించి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు మరో ప్రమాదకర క్రీడకు సిద్ధపడ్డారు. సౌదీ అరేబియాతో తమకు ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందంటూ అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. తన నిర్ణయం పర్యవసానాలూ, పరిణామాల గురించి పూర్తిగా తెలిసే ట్రంప్ ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఇది పశ్చిమాసియా అమరికను సంపూర్ణంగా మార్చే... ఇప్పటికే సాగుతున్న ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం. 30 యేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ప్రమాణాలను సాధించటంతోపాటు ప్రాంతీయ భద్రతకూ, అమెరికా భద్రతకూ కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది.
రాగలకాలంలో దేశానికి ఇది వందలకోట్ల వాణిజ్యాన్ని తీసుకొస్తుందనీ... దేశ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరటానికి దోహదపడుతుందనీ కూడా చెప్పుకుంటోంది. ఒకపక్క తన చర్యల ద్వారా అణ్వాయుధ తయారీకి దోహదపడుతూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధమే ధ్యేయమని చెప్పటం ఉత్త వంచన. ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ తొలి ఏలుబడిలో మన దేశంతో అమెరికా కుదుర్చుకున్న ‘123’ ఒప్పందమే కదా అనిపిస్తుంది. అగ్రరాజ్యాలతోపాటు మనతోసహా పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదనంగా సౌదీ దగ్గర ఉంటే నష్టమేమిటన్న సందేహాలు కూడా కలుగుతాయి. పైగా ఇది పౌర అణు ఒప్పందమే అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే ఇందులో లొసుగులు బయటపడతాయి. సౌదీ అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించుకోవటానికే ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాదన.
ప్రకృతిలో లభించే యురేనియంలోని రెండు ఐసోటోపుల్లో ఒకటైన యూ– 235 మాత్రమే అణు విచ్ఛేదనానికీ, గొలుసు చర్య జరిగి అపారమైన శక్తి విడుదలకూ తోడ్పడు తుంది. యురేనియంను 3 నుంచి 5 శాతంవరకూ శుద్ధి చేస్తే అణు విద్యుత్ ఉత్పాదన సాధ్యమవుతుంది. శుద్ధి 90 శాతానికి చేరితే అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. అయితే విద్యుదుత్పాదన తర్వాత వాడేసిన ఇంధనంతో ప్లూటోనియం తయారీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిరోధించేందుకే ‘గోల్డ్ స్టాండర్డ్’ పేరుతో అమెరికా కఠినమైన షరతు విధిస్తోంది. దాన్నుంచి సౌదీకి మినహాయింపు ఇవ్వటం పైనే అందరికీ ఆందోళన. ఆ షరతు ఉంటుందని తాజాగా అమెరికా ఇస్తున్న వివరణ నమ్మశక్యంగా లేదు.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇరాన్ సంతకం చేసినా, అణుబాంబు తయారీకి వ్యతిరేకంగా అక్కడ ఫత్వా అమల్లో ఉన్నా ఆ దేశం అణు బాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకూ, ఇజ్రాయెల్కూ ఉన్నాయి. తరచు ఇరాన్పై అమెరికా విరుచుకుపడటానికి కారణం అదే. ‘ఇరాన్ ఆ పని చేస్తే... మేం సైతం ఆ బాటలోనే వెళ్తాం’ అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా పదే పదే చెబుతున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వటమంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారడానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం... శత్రుదేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం’ అనే నైజం అత్యంత ప్రమాదకరమైనది.
‘మనిషి అణుబాంబును కనిపెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ ఎలుకా ఎలుకలబోను తయారుచేసుకోదు’ అని ఐన్స్టీన్ చేసిన వ్యాఖ్య ఆంతర్యం స్పష్టమే. ఇది స్వీయ హననానికి దారితీసే తెలివిమాలిన చర్య. భవిష్యత్తులో అణుశక్తి దేశంగా మారాక సౌదీ, అమెరికా చెప్పుచేతల్లో ఉండదు. తాము చేస్తే తప్పేమిటని ఇరాన్ సైతం ఆ బాట పడుతుంది. చిన్న నిప్పురవ్వ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడే భగ్గున మండిస్తుంటే ఇక అణ్వాయుధాలుంటే చెప్పేదేముంది? ఇప్పటికే ఇజ్రాయెల్ స్వీయరక్షణకంటూ అమెరికా దానికి అణ్వాయుధాలు సరఫరా చేసింది. దాని రక్షణ పేరుచెప్పే తరచు ఇరాన్పై దాడులు చేస్తోంది. నిజానికి స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవిస్తే ఇజ్రాయెల్కు ఇలాంటి రక్షణల అవసరమే ఉండదు. దాన్ని సాకారం చేయకుండా ఈ ప్రాంతాన్ని అణ్వస్త్రాల మయం చేయటం క్షమించరాని నేరం.


