సెన్సెక్స్ 715 పాయింట్లు పతనం
24,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ
రూ. 4.25 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ముంబై: ముడిచమురు ధరలు పరుగులు తీయడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడో రోజూ నష్టపోయింది. బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో బుధవారం సెన్సెక్స్ 715 పాయింట్లు కోల్పోయి 76,755 వద్ద నిలిచింది. నిఫ్టీ 191 పాయింట్లు పతనమై 24,000 స్థాయి దిగువన 23,996 వద్ద స్థిరపడింది. దలాల్ స్ట్రీట్ ఒక శాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.25 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్ క్యాప్ రూ.480 లక్షల కోట్లకు దిగివచ్చింది.
రోజంతా నష్టాల్లోనే
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయమే బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీలు ఏ దశలో కోలుకోలేక, రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. ఒకానొక దశలోనూ సెన్సెక్స్ 829 పాయింట్లు క్షీణించి 76,641 వద్ద, నిఫ్టీ 226 పాయింట్లు కుప్పకూలి 23,961 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి.
నష్టాలు ఎందుకంటే
ఎర్రసముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీల ముప్పు తీవ్రమవడం, హార్మూజ్ జలసంధిలో సరఫరా అడ్డంకులు తలెత్తడంతో ముడిచమురు (బ్రెంట్ క్రూడ్) ధర బ్యారెల్కు 92 డాలర్లపైకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందుల దిగుమతులపై దశలవారీగా 200% వరకు సుంకాలు (టారిఫ్లు) విధిస్తామని ప్రకటించారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోగా, ఈ ఏడాది పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడ్డాయి. పదేళ్ల కాలపరిమితి కలిగి బాండ్లపై రాబడులు 4.63 శాతానికి పెరిగాయి. గత నాలుగు రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 6,000 కోట్లకు పైగా విలువైన భారతీయ షేర్లను విక్రయించారు. ఈ పరిణామాలన్నీ, దేశీయ స్టాక్ మార్కెట్పై తీవ్ర ఒత్తిడి పెంచాయి.
28 పైసలు తగ్గిన రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 96.53 వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరలు అనూహ్యంగా పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి అధికమవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 96.36 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 96.25 – 96.60 పరిధిలో ట్రేడైంది. ట్రంప్ సుంకాల హెచ్చరికలపై మళ్లీ నెలకొన్న ఆందోళనలు కూడా ఫారెక్స్ ట్రేడర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
ఫార్మా షేర్లకు ‘సుంకాల’ భయాలు
అమెరికాకు ఎగుమతి అయ్యే జెనరిక్ ఔషధాలపై దిగుమతి సుంకాలను (టారిఫ్) విధిస్తామంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ‘‘ఫార్మా కంపెనీలు అమెరికాలోనే స్వదేశీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రెండేళ్ల గడువు ఇస్తున్నాం. 2026 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు సున్నా శాతం సుంకాన్ని కొనసాగిస్తాం.
ఆ తర్వాత ఒక ఏడాది పాటు (2028 ఆగస్టు నుంచి) 100 శాతం, ఆపై (2029 ఆగస్టు నుంచి) 200 శాతం చొప్పున దిగుమతి సుంకాలు ఉంటాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు అత్యధికంగా జెనరిక్ మందులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీంతో ఫార్మా కంపెనీల మార్జిన్లు, ఎగుమతి ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్ఈలో లుపిన్ షేరు అత్యధికంగా 4.21 శాతం పతనమైంది. అరబిందో ఫార్మా (1.99%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (1.95%), గ్లెన్మార్క్ (1.49%), ఆల్కెమ్ ల్యాబ్స్ (1.43%), సిప్లా (1.08%), సన్ ఫార్మా (0.98%), బయోకాన్ (0.57%) షేర్లు నష్టాల్లో ముగిశాయి.
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు ఆవిరి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈలో ఈ షేరు ఒక శాతానికి పైగా నష్టపోయి రూ.753.15 వద్ద స్థిరపడింది. ఒక దశలో 1.50 శాతం పతనమై రూ.750.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు జూన్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, నికర వడ్డీ మార్జిన్ల తగ్గదలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించాయి. ముఖ్యంగా, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ఏకంగా 8.11% మేర పతనమైంది. ఈ ఊహించని పతనంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లు ఆవిరై, రూ. 11.59 లక్షల కోట్లకు దిగివచ్చింది.


