భారత్‌ ‘ఫార్మా’కు ట్రంప్ భారీ షాక్! | Trump Says tariffs on generic drugs after two-year pause | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఫార్మా’కు ట్రంప్ భారీ షాక్!

Jul 22 2026 7:39 AM | Updated on Jul 22 2026 2:41 PM

Trump Says tariffs on generic drugs after two-year pause

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై భారీ టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఔషధ తయారీని తిరిగి అమెరికాలోనే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త విధానం భారత ఔషధ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా చేసిన పోస్టులో.. రానున్న ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలపై రెండేళ్ల పాటు సున్నా శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. ఆ గడువు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం పాటు 100 శాతం టారిఫ్, ఆ తర్వాత 200 శాతం టారిఫ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అమెరికాలోనే జనరిక్ ఔషధాల తయారీని పెంచేందుకు, విదేశీ కంపెనీలు అక్కడ ప్లాంట్లు, తయారీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువులోగా అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ టారిఫ్‌లు ఒక విధమైన జరిమానాగా పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు.

అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. పేటెంట్ ఉన్న బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం యథాతథంగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారత ఔషధ పరిశ్రమలో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచానికి తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులను సరఫరా చేస్తున్నందుకు భారత్‌ను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా పిలుస్తారు. ముఖ్యంగా భారత ఔషధ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం, 2025లో భారత్ అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ఔషధ ఎగుమతులైన 25.8 బిలియన్ డాలర్లలో 38 శాతానికి సమానం. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు అమెరికాలో విస్తృతంగా ఉపయోగించే జనరిక్ మందుల్లో భారత కంపెనీల వాటా కీలకంగా ఉంది.

ట్రంప్ ప్రకటించిన విధానం అమల్లోకి వస్తే, అమెరికాకు ఎగుమతులు చేసే భారత ఫార్మా కంపెనీలు అక్కడే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. లేకపోతే భారీ టారిఫ్‌ల కారణంగా అమెరికా మార్కెట్‌లో తమ ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు పోటీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాలో తయారీని విస్తరించే కంపెనీలకు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనం కలగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం తుది రూపంలో ఎలా అమలవుతుంది, ఎలాంటి మినహాయింపులు ఉంటాయి, అంతర్జాతీయ ఔషధ కంపెనీలు ఎలా స్పందిస్తాయి అనే అంశాలపై దీని వాస్తవ ప్రభావం ఆధారపడి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement