ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా ఖజానాపై భారీ భారంగా మారుతోంది. ఇప్పటివరకు ఈ యుద్ధానికి సంబంధించిన ఖర్చు 37.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. యుద్ధ వ్యయాలను భరించేందుకు అదనపు నిధులు కేటాయించాలని ఆయన అమెరికా కాంగ్రెస్ను కోరారు.
కాంగ్రెస్ కమిటీలో జరిగిన విచారణ సందర్భంగా హెగ్సెత్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ మొత్తం ఖర్చులో ఇప్పటికే జరిగిన యుద్ధ కార్యకలాపాలతో పాటు.. సెప్టెంబర్ 30 వరకు అంచనా వేసిన వ్యయాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ అదనపు నిధుల కోసం ప్రయత్నిస్తోంది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో కాంగ్రెస్ను దాదాపు 90 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.7 లక్షల కోట్లకు పైగా) అదనపు నిధులు కోరారు. ఇందులో ఎక్కువ భాగం ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఖర్చులేనని సమాచారం. అంతేకాకుండా 2027 ఆర్థిక సంవత్సరానికి పెంటగాన్ ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.128 లక్షల కోట్లకు పైగా) బడ్జెట్ను ప్రతిపాదించింది. ఈ నిధులు కేటాయించకపోతే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని రక్షణ మంత్రి హెగ్సెత్ వ్యాఖ్యానించారు.
యుద్ధంపై అమెరికాలో అసంతృప్తి
ఇరాన్తో యుద్ధంపై అమెరికాలో విమర్శలు పెరుగుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యుద్ధ వ్యయం, ద్రవ్యోల్బణం అంశాలను ప్రతిపక్ష డెమొక్రాట్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్లో పలువురు సభ్యులు.. ట్రంప్ ప్రభుత్వం యుద్ధ పరిణామాలపై తమకు తగిన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డెమొక్రాట్ సెనేటర్ పాటీ ముర్రే మాట్లాడుతూ.. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగుతుందా అన్న ఆందోళన వ్యక్తం చేశారు.
18 మంది అమెరికా సైనికుల మృతి
ఇరాన్తో జరుగుతున్న పోరులో ఇప్పటివరకు 18 మంది అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ తెలిపింది. మరో 430 మంది వరకు సైనికులు గాయపడినట్లు వెల్లడించింది. అయితే జూలై 7 తర్వాత గాయపడిన వారిలో 96 శాతం మంది తిరిగి విధుల్లో చేరారని అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలోనే కుప్పకూలింది. ఆ తర్వాత ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్లోని లక్ష్యాలపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఇంధన కేంద్రాలు, వంతెనలు, వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఖార్గ్ ద్వీపం, అణు కేంద్రాలపై ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్లో కీలకమైన ఖార్గ్ ద్వీపం చమురు కేంద్రంపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే భూగర్భంలో ఉన్న అణు సంబంధిత కేంద్రాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తాజాగా ఓ లోతైన భూగర్భ అణు కేంద్రాన్ని(పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain) “త్వరలోనే ధ్వంసం చేస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు.
సైనిక సామర్థ్యాలపై ప్రభావం
యుద్ధ ఖర్చులు పెరగడంతో అమెరికా సైనిక శిక్షణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసర నిధులు అందకపోతే సైనిక నిర్వహణ, ఆయుధాల ఆధునీకరణ, భవిష్యత్ రక్షణ ప్రాజెక్టులపై ఒత్తిడి పెరుగుతుందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ తెలిపారు.
మొత్తంగా.. ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనదైనా.. దాని ఆర్థిక భారం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. బిలియన్ల డాలర్ల ఖర్చు, సైనిక నష్టాల మధ్య ట్రంప్ ప్రభుత్వానికి ఇరాన్ యుద్ధం సవాల్గా మారుతోంది.


