ఇరాన్ మిలటరీ స్థావరాలపై అమెరికా దాడులు
హర్మూజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ ప్రతిదాడి
ఇస్లామాబాద్: ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం మంగళవారానికి పదో రోజుకు చేరుకుంది. దాడి ప్రతిదాడుల మధ్య చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలూ ఊపందుకుంటున్నాయి. అమెరికా మంగళవారం ఇరాన్ మిలటరీ స్థావరాలు లక్ష్యంగా దాడులకు దిగింది. మిలటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ల లాంచింగ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపిందని మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఒక నౌకపై దాడి చేసింది.
దీంతో సిబ్బంది నౌకను వదిలి పారిపోయారు. బెలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఫార్స్, హొర్మోజ్గాన్, ల్లామ్, కెర్మాన్, సిస్టాన్ల వద్ద పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికార మీడియా సంస్థ మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో అమెరికా మిత్రదేశాలు జోర్డాన్, బహ్రయిన్, కువైట్లో విద్యుత్తు, నిర్లవణీకరణ కేంద్రాలపై దాడులు జరిపింది. ఇరాన్ ప్రయోగించిన ఐదు డ్రోన్లు, మూడు క్షిపణులను కూల్చేసినట్లు జోర్డాన్ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం బహ్రయిన్లో ఇరాన్ దాడులపై హెచ్చరికలు జారీ చేస్తూ సైరన్లు మోగాయి.
ఇదిలా ఉంటే ఇరాన్ ఒక నిర్లవణీకరణ కేంద్రంపై దాడి చేసిందని, సోమవారం రాత్రి జరిగిన ఈ దాడిలో కేంద్రం దెబ్బతన్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కూడా పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లకు దగ్గరైంది. అలాగే మధ్యంతర ఎన్నికల నేపథ్యం, ద్రవ్యోల్బణం పెరగవచ్చునన్న అంచనాల కారణంగా అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర రికార్డు స్థాయిలో నాలుగు డాలర్లకు చేరింది.
పాకిస్థాన్లో ఇరాన్ హోం మంత్రి
ఇరాన్– అమెరికాల మధ్య దాడి, ప్రతిదాడులు కొనసాగుతూండగానే ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మోమేనీ మంగళవారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, ప్రధాని షాబాజ్ షరీఫ్లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు జరిగిందో స్పష్టం కాలేదు. ఇరాన్ – అమెరికాల మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ గత నెలలో ఇరుపక్షాలు ఒక మధ్యంతర అంగీకారానికి వచ్చేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం కాస్తా వీగిపోయి మళ్లీ యుద్ధం మొదలైన నేపథ్యంలో ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాలని పాకిస్థాన్ ఆహా్వనిస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంకాలమే పాకిస్థాన్ చేరుకున్న మొమేనీని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మోహసిన్ నక్వీని స్వాగతించారు. ఆ తరువాత అసీమ్ మునీర్తో సమావేశమయ్యారు. చివరగా పాక్ ప్రధానితో చర్చలు జరిపారు. మరోవైపు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మార్కో రూబియో కూడా చర్చలకు సై అంటూనే అవి వాస్తవికంగా ఉండాలన్న షరతు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్కు వాస్తవికం అనిపించే ఏర్పాటును ఇరాన్ చూపగలదా? అన్న ప్రశ్న వస్తోంది. ఇరుపక్షాల్లోనూ అపనమ్మకం వేళ్లూనుకున్న పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.


