న్యూఢిల్లీ: స్టాండెలోన్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నికర లాభం మూడు రెట్లు వృద్ధి చెంది రూ. 5,253 కోట్లకు చేరింది. ట్యాక్స్ చెల్లింపుల భారం తగ్గడం ఇందుకు దోహదపడింది. క్రితం క్యూ1లో బ్యాంకు రూ. 1,675 కోట్ల నికర లాభం నమోదు చేసింది. కొత్త ట్యాక్స్ విధానానికి మళ్లడంతో పన్ను భారం రూ. 3,358 కోట్ల మేర తగ్గినట్లు బ్యాంకు ఎండీ అశోక్ చంద్ర తెలిపారు. దీనితో తొలి త్రైమాసికానికి సంబంధించి అత్యధికంగా రూ. 5 వేల కోట్ల పైగా లాభం సాధ్యపడినట్లు వివరించారు.
సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం పెద్దగా మార్పు లేకుండా రూ. 37,231 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం రూ. 10,578 కోట్ల నుంచి రెండు శాతం వృద్ధితో రూ. 10,798 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లు 425 మిలియన్ డాలర్లు సమీకరించగా, సెప్టెంబర్ 30 ఆఖరు నాటి వరకు 2.5 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చంద్ర వివరించారు. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) రూ. 42,673 కోట్ల నుంచి రూ. 35,381 కోట్లకు, నికర నిరర్థక ఆస్తులు (ఎన్ఎన్పీఏ) రూ. 4,132 కోట్ల నుంచి రూ. 3,433 కోట్లకు నెమ్మదించాయి. జీఎన్పీఏ నిష్పత్తి 3.78 శాతం నుంచి 2.78 శాతానికి, ఎన్ఎన్పీఏ నిష్పత్తి 0.38 శాతం నుంచి 0.26 శాతానికి తగ్గాయి.
యస్ బ్యాంక్కు రుణ వృద్ధి మద్దతు
జూన్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ నికర లాభం 32.54 శాతం వృద్ధితో రూ. 808.65 కోట్ల నుంచి రూ. 1,072 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 17.5 శాతం పెరిగి రూ. 2,371 కోట్ల నుంచి రూ. 2,786 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 2.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ (ఆర్ఐడీఎఫ్) బ్యాలెన్స్లు మరింత తగ్గి, రిటైల్ రుణాలు పుంజుకునే కొద్దీ మధ్యకాలికంగా మార్జిన్లు మరింత మెరుగుపడగలవని యస్ బ్యాంక్ ఎండీ వినయ్ ఎం టోన్సే తెలిపారు. ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మొత్తం డిపాజిట్లు 14.3 శాతం వృద్ధితో రూ. 2.76 లక్షల కోట్ల నుంచి రూ. 3.15 లక్షల కోట్లకు చేరాయి. నికర రుణాలు 18.3 శాతం పెరిగి రూ. 2.85 లక్షల కోట్లకు పెరిగాయి.


