ఫిన్టెక్, స్టాక్ బ్రోకరేజీ సంస్థ ‘ఏంజెల్ వన్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) ఆకర్షణీయమైన పనితీరు కనబరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల చురుకైన పార్టిసిపేషన్, భారీ ట్రేడింగ్ వాల్యూమ్స్ కారణంగా జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలకు పైగా ఎగసి రూ.231 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (క్యూ1) కంపెనీ నికర లాభం రూ.114.5 కోట్లుగా నమోదైంది. అయితే, మునుపటి త్రైమాసికంతో (ఎఫ్వై26, క్యూ4) పోలిస్తే మాత్రం నికర లాభం 28 శాతం తగ్గి రూ.320 కోట్ల నుంచి రూ.231 కోట్లకు పరిమితమైంది.
సమీక్షా త్రైమాసికంలో, కంపెనీ మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగి రూ.1,143 కోట్ల నుంచి రూ.1,434 కోట్లకు చేరినట్లు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. ఉద్యోగుల ఖర్చులు, ఫైనాన్స్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఇదే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ.979 కోట్ల నుంచి రూ.1,109 కోట్లకు చేరాయి. కాగా, కంపెనీ బోర్డు డైరెక్టర్లు తమ షేర్ హోల్డర్లకు ప్రతి ఈక్విటీ షేరుపై రూ. 1 తొలి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించారు.
పెరిగిన ఆర్డర్లు, ఏయూఎం
ప్రస్తుత త్రైమాసికంలో మొత్తం ట్రేడింగ్ ఆర్డర్లు 18.4% పెరిగి 40.6 కోట్లకు చేరాయి. కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ విభాగం నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) జూన్ చివరి నాటికి ఏకంగా 81.4 శాతం ఎగసి రూ.620 కోట్లకు చేరుకుంది. మొత్తం క్లయింట్ల బేస్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 19 శాతం వృద్ధితో 3.86 కోట్లకు చేరింది.
‘గ్రో’ నికర లాభం 94 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. జూన్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 94 శాతం ఎగసి రూ.735 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో కంపెనీ రూ.378 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ద్వారా ఆదాయం 66 శాతం వృద్ధితో రూ.904 కోట్ల నుంచి రూ.1,501 కోట్లకు చేరినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.445 కోట్ల నుంచి రూ.556 కోట్లకు పెరిగాయి.
గత త్రైమాసికంతో పోలిస్తే...
గత త్రైమాసికం (జనవరి–మార్చి) తో పోల్చితే కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.1,505 కోట్ల నుండి రూ.1,501 కోట్లతో దాదాపు స్థిరంగానే కొనసాగింది. అయితే, నికర లాభం మాత్రం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.686.36 కోట్లతో పోలిస్తే ప్రస్తుత క్యూ1లో మెరుగైన వృద్ధిని నమోదు చేయడం విశేషం.


