దేశంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) పథకంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ), 2013కు సవరణలు చేస్తూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్మెంట్) బిల్లు, 2026’ ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఇప్పటివరకు ప్రతి అంత్యోదయ కుటుంబానికి లభిస్తున్న స్థిర కోటా (35 కిలోల ఆహారధాన్యాలు) విధానంలో మార్పులు రానున్నాయి.
కొత్త రూల్ ఏమిటి?
ప్రస్తుతం అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ఆహారధాన్యాలను (ఉచితంగా) అందిస్తున్నారు. అయితే, కొత్త ముసాయిదా చట్టం ప్రకారం.. ఇకపై కుటుంబ ప్రాతిపదికన కాకుండా, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున రేషన్ కేటాయించనున్నారు. అదే సమయంలో ఒక ఫ్యామిలీకి ఇచ్చే గరిష్ఠ పరిమితిని 35 కిలోలుగానే ఉంచనున్నారు.
చిన్న కుటుంబాలకు కోత.. పెద్ద కుటుంబాలకు ఎలా?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త వ్యక్తిగత పరిమితి విధానం వల్ల ఒకటి నుంచి నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు రేషన్ కోటా భారీగా తగ్గనుంది. ఒక్కరు ఉండే కుటుంబానికి 35 కిలోల స్థానంలో కేవలం 7 కిలోలు మాత్రమే అందుతాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే గరిష్ఠ పరిమితి 35 కిలోలు మాత్రమే అందుతుంది. అంటే ఐదుగురు కంటే ఎక్కువ (ఉదాహరణకు ఆరుగురు) ఉన్న కుటుంబంలో తలసరి కోటా 7 కిలోల కంటే తక్కువకు పడిపోతుంది.
ప్రభుత్వ వాదన ఏమిటి?
తక్కువ మంది ఉన్న కుటుంబాలకు ఎక్కువ రేషన్, ఎక్కువ మంది ఉన్న పేద కుటుంబాలకు తలసరిగా తక్కువ రేషన్ అందుతోందని ఈ వ్యత్యాసాన్ని తొలగించి పంపిణీని మరింత హేతుబద్ధం చేయడానికే ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు కేంద్ర ఆహార శాఖ పేర్కొంది. సాధారణ ప్రాధాన్యత గల కుటుంబాలకు ఇచ్చే తలసరి 5 కిలోల కంటే ఇది ఎక్కువగా (7 కిలోలు) ఉంటుందని స్పష్టం చేసింది.
రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..
ఈ ముసాయిదా చట్టంపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలు కావడం వల్ల చిన్న కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీస్) ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టం వల్ల వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్న అంత్యోదయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వ్యక్తగత ప్రాతిపదికన రేషన్ ఇవ్వాలనుకుంటే కుటుంబానికి విధించిన 35 కిలోల గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) ఎత్తివేయాలని, లేదంటే పెద్ద కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుందని ఆహార భద్రతా హక్కుల కార్యకర్తలు సూచిస్తున్నారు. ఈ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు


