తమిళనాడు: రెండేళ్ల పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లికి యువకుడు నిరాకరించిన క్రమంలో ఓ ప్రైవేటు వైద్యశాల నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జేజే నగర్ ప్రాంతానికి చెందిన దేవరాజ్ కుమార్తె జయలక్ష్మి(23). ఈమే నర్సుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జయలక్ష్మి తిరువేలాంగాడు ప్రాంతానికి చెందిన యువకుడిని రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని నమ్మించి పలుసార్లు దగ్గరైనట్లు తెలిసింది.
అయితే గత కొద్ది రోజుల నుంచి యువకుడు జయలక్ష్మికి దూరంగా వుండడంతో పాటూ వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. దీంతో జయలక్ష్మి తనను పెళ్లిచేసుకోవాలని ఘర్షణ పడింది. బుధవారం మరోసారి ఫోన్లో తననూ పెళ్లి చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


