యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు.
ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి.


