లండన్: యూకేలోని లండన్లో గల గ్యాట్విక్ విమానాశ్రయంలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. టెనెరీఫ్, వలెన్సియా, లాంజరోట్, రోడ్స్, ఏథెన్స్, బారి, రోమ్, అగాదిర్ నుండి గ్యాట్విక్ వైపు వస్తున్న తొమ్మిది విమానాలు అత్యవసర స్థితిని ప్రకటించాయి. గ్యాట్విక్ విమానాశ్రయంలోని ఏకైక రన్వేపై బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్బస్ A320 విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది.
విమానంలోని నోస్ గేర్ స్టీరింగ్లో తలెత్తిన సమస్య వల్ల ఆ విమానం రన్వేపైనే ఆగిపోయింది. దీనిని తొలగించేందుకు సుమారు 30 నిమిషాల సమయం పట్టింది. ఈ క్రమంలో గ్యాట్విక్లో ల్యాండ్ కావాల్సిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది లేదా ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. మొత్తం 14 విమానాలు ప్రభావితం కాగా, వాటిని లండన్ లూటన్, స్టాన్స్టెడ్, హీత్రూ, బర్మింగ్హామ్ విమానాశ్రయాలకు మళ్లించారు. బుధవారం తెల్లవారుజామున 1:30 గంటలకు విమానాశ్రయం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గ్యాట్విక్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్వే విమానాశ్రయమని, ఇక్కడ ఏటా 2,63,000కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు


