బ్రిటన్లో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండన్కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెడ్ఫోర్డ్ ప్రాంతంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు బ్రిటిష్ మీడియా తెలిపింది. అయితే గాయపడిన వారి సంఖ్య మాత్రం అధికారులు వెల్లడించలేదు.
ప్రమాదం అనంతరం ప్రయాణికులను రైళ్ల నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. దెబ్బతిన్న బోగీలు, పట్టాలపై నిలబడి ఉన్న ప్రయాణికుల చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఘటనపై బ్రిటన్ రవాణా శాఖ మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
బ్రిటన్లో రైలు ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి. 2023లో స్కాట్లాండ్లోని అవిమోర్ రైల్వే స్టేషన్లో రెండు రైళ్లు ఢీకొనగా పలువురు గాయపడ్డారు. ఆ ప్రమాదంలో ప్రపంచ ప్రసిద్ధ శతాబ్దం నాటి ఆవిరి ఇంజిన్ రైలు Flying Scotsman భాగమైంది.
అంతకుముందు 2020లో స్కాట్లాండ్లోని స్టోన్హేవన్ సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మరణించారు. ఆ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. అనంతరం భద్రతా లోపాలను అంగీకరించిన Network Rail సంస్థకు 2023లో 6.7 మిలియన్ పౌండ్ల జరిమానా విధించారు.


