న్యూఢిల్లీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోటను మూసివేస్తున్నట్లు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ప్రకటించింది. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎస్ఐ వెల్లడించింది.
ఈ కాలంలో కోటలోకి సందర్శకులెవరికీ అనుమతి ఉండదు. 1959 నాటి పురావస్తు స్మారక చిహ్నాల నిబంధనల ప్రకారం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని భద్రతా సంస్థల ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల రోజుల వ్యవధిలో కోట ప్రాంగణంలో వేదికల నిర్మాణం, సాంకేతిక పరికరాల ఏర్పాటు, భద్రతా తనిఖీలు చేపట్టనున్నారు.
2022 నుంచి ప్రతి ఏటా ఇలా ఒక నెల రోజుల పాటు ఎర్రకోటను మూసివేసే సంప్రదాయం కొనసాగుతోంది. కాగా, ఆగస్టు 15న నిర్వహించే అధికారిక వేడుకలకు ప్రత్యేక పాస్లు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ప్రధాన వేదికగా నిలుస్తున్నందున, భద్రత పరంగా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: వాంగ్చుక్ దీక్షపై రాహుల్ మౌనం వెనుక..


