కోల్కతా: ప్రపంచం మెుత్తాన్ని యోగా ఏకం చేసిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈరోజు (ఆదివారం) 12 వ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బెంగాల్లో రామకృష్ణ పరమహాంస లాంటి మహానీయులు జన్మించారన్నారు. కాగా కోల్కతాలోని రెడ్రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో 35 వేల మంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ "యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చొరవ చూపిస్తున్నారు. ఈ రోజు భౌగోళిక సరిహద్దులను దాటి ఒక భారీ సామూహిక ఉద్యమంగా ఎదిగింది. యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా మారింది, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఇందుకు సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు వస్తున్నాయి" అని అన్నారు.

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జూన్ 21వ తేదీకి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, ఎందుకంటే ఇది సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన పగలు (Longest Day) కలిగిన రోజు అని ప్రధాని గుర్తు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా ఈ తేదీకి ఇప్పుడు అదనంగా మరొక ప్రపంచ గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. కాగా ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో 40 ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో యోగా డే వేడుకలు నిర్వహించారు.


