అమెరికాను ఎట్టిపరిస్థితుల్లోనూ పతనం కానివ్వం
‘సెల్యూట్ అమెరికా’ వేడుకలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టికరణ
వాషింగ్టన్: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆనందకరమైన, అద్భుతమైన మైలురాళ్లలో ఒకటిగా అభివర్ణించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాజధాని వాషింగ్టన్లోని నేషనల్ మాల్లో ‘సెల్యూట్ అమెరికా’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న యోధులతోపాటు పలువురు ప్రముఖులను సత్కరించారు. వియత్నాం యుద్ధరంగంలో ప్రత్యేక దళాలకు నాయకత్వం వహించిన తొలి నల్లజాతి అధికారిని సన్మానించారు.
తనదైన శైలిలో ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కమ్యూనిజంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనం ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటామని అమెరికన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికాను ఎట్టిపరిస్థితుల్లోనూ పతనం కానివ్వబోమని తేల్చిచెప్పారు. తాము ఎల్లప్పుడూ అత్యుత్తమంగానే ఉంటామన్నారు. ‘సేవ్ అమెరికా చట్టాన్ని’ ఆమోదించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.
‘‘రోజు మన దేశం మళ్లీ విజయం సాధిస్తోంది. మునుపెన్నడూ లేనంత గొప్పగా పునరాగమనం చేసింది. మనం అమెరికాను గొప్పగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. దీని ప్రకారం ఓటర్లందరూ తమ ఓటరు గుర్తింపు కార్డును చూపించాలి. అలాగే పౌరసత్వానికి సంబంధించిన రుజువును తప్పనిసరిగా సమర్పించాలి’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.
ఇది నాకు ‘మూడో పర్యాయం’
మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. తన హయాంలో అమెరికా సైన్యం ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని వివరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. తన ప్రస్తుత అధ్యక్ష పదవీకాలాన్ని ‘రెండో పర్యాయం’ అని కాకుండా ‘మూడో పర్యాయం’ అని పిలిచి ఉండాల్సిందని చెప్పారు. 2020 నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే బైడెన్ గెలిచారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఆ ఎన్నికల్లో విజయం తనదేనని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదగడం చరిత్రలో యాదృచి్ఛకంగా జరిగిన పరిణామం కాదని ట్రంప్ తేల్చిచెప్పారు. అధ్యక్షుడిగా తన మొదటి పదవీ కాలంలో సైన్యాన్ని గొప్పగా పునరి్నరి్మంచామని అన్నారు. వాస్తవానికి సైన్యాన్ని మూడో పదవీకాలంలో ఉపయోగిస్తామని చెప్పాలని వెల్లడించారు. కానీ, అలా చెప్పే ఉద్దేశం లేదన్నారు. వివాదానికి ఆస్కారం కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు.
స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమే
ఎంతోమంది వీరుల త్యాగంతో అమెరికా జెండా ఎల్లప్పుడూ స్వేచ్ఛ, న్యాయాలకు చిహ్నంగా నిలుస్తోందని ట్రంప్ అన్నారు. చరిత్రకు సాక్షిగా నిలిచిన పలు అమెరికా జాతీయ జెండాలను నేషనల్ మాల్లో ప్రదర్శించారు. అమెరికా తొలినాటి జెండా కూడా ఇందులో ఉంది. 1777 నాటి జెండాను ట్రంప్ చూపించారు. అప్పట్లో 13 రాష్ట్రాలకు ప్రతీకగా 13 నక్షత్రాలు, 13 పట్టీలు ఉన్న జెండా అని చెప్పారు. యార్క్టౌన్ యుద్ధ సమయంలో విజయగర్వంతో రెపరెపలాడిన నక్షత్రాలు, పట్టీల జెండాను గుర్తుచేసుకున్నారు.
నిరంకుశత్వంపై స్వేచ్ఛ సాధించిన విజయాన్ని, అణచివేతపై స్వాతంత్య్రం పొందిన ఆధిక్యతను 1776 జూలై 4 నుంచి 2026 జూలై 4 వరకు అమెరికన్ స్ఫూర్తి సాధించిన చిరస్థాయి విజయాన్ని నేడు గొప్ప వేడుకగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. అమెరికాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఇది అమెరికా స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమే. రెండున్నర శతాబ్దాల క్రితం నాటి తరహాలోనే ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాం. మా దేశం, మా పిల్లల కోసం, స్వేచ్ఛా ఆశయం కోసం మా దేశాన్ని ఎవరూ చేరుకోని సరికొత్త శిఖరాలకు చేరుస్తాం.
దేశాన్ని మరింత గొప్పగా, మెరుగ్గా, శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. అమెరికాను మరింతగా ప్రేమిస్తాం’’ అని ట్రంప్ స్పష్టంచేశారు. అనారోగ్యం, వైకల్యం, సైనిక విధి నిర్వహణ లేదా ప్రయాణం వంటి అనివార్య కారణాలు ఉంటే తప్ప ఇకపై పోస్ట్ ద్వారా ఓటు వేసే విధానం ఉండదని చెప్పారు. దాంతో ఎన్నికల్లో మోసాలకు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇందులో అర్థం కాని విషయం ఏదీ లేదన్నారు.
కమ్యూనిజాన్ని ట్రంప్ మళ్లీ తప్పుపట్టారు. ‘‘కమ్యూనిస్ట్ వ్యవస్థ అమెరికన్ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. కమ్యూనిస్ట్ వ్యవస్థ ఎప్పుడూ విజయవంతం కాలేదు. ఆ ప్రమాదకరమైన వ్యవస్థ తిరిగి అమెరికాలో తన వికృత రూపాన్ని చూపిస్తామంటే ఇక్కడ ఎవరూ ఒప్పుకోరు. అమెరికా ఎప్పటికీ కమ్యూనిస్ట్ దేశం కాదు’’ అని ట్రంప్ పునరుద్ఘాటించారు.


