పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) 30వ వ్యవస్థస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ సుప్రీమ్ లాలు ప్రసాద్ యాదవ్ బిహార్ ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆదివారం ఒక సందేశాన్ని విడుదల చేశారు. 1997 జూలై 5న ప్రారంభమైన తమ పార్టీ మూడు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లోకి తీసుకుని, ఏకపక్ష అధికార బలంతో బీజేపీ దేశాన్ని వెనక్కి నెట్టేస్తోందని లాలు ఆరోపించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్జేడీ కేవలం ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ మాత్రమే కాదని, కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా సమాజంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల హక్కుల కోసమే ఈ పార్టీ పుట్టిందని, రాబోయే రాజకీయ పోరాటం గతంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు విభేదాలను పక్కనబెట్టి, పార్లమెంట్ నుంచి వీధుల వరకు ప్రజల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.


