సాంకేతిక అనేది ఎప్పటికైనా ప్రమాదకరమేనని, దీని వల్ల ఉద్యోగాలు కోల్పోతాం, టెక్నాలజీలకు బానిసలమైపోతాం అని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తుంటారు. అయితే ఇది కొందరికీ..గొప్ప అపురూప క్షణాలు, అలానాటి జ్ఞాపకాలను అందించగలదు. కోల్పోయింది కనులముందే సాక్షాత్కరించేలా చేసి, కళ్లల్లో నీళ్లు జాలువారేలా చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ 93 ఏళ్ల బామ్మ కథ.
అసలేం జరిగిందటే..చైనాలోని లియుయాంగ్కు అనే ప్రాంతానికి చెందిన 93 ఏళ్ల ఝావో కుయిఫెన్ అనే మహిళ 70 ఏళ్ల క్రిత యుద్ధంలో భర్తను కోల్పోయింది. అదికూడా పెళ్లి అయిన కొద్దికాలానికే. ఆమె సరిగ్గా 1950ల ప్రారంభంలో ఝాంగ్ జిక్సిన్ను వివాహం చేసుకుంది. వారి వివాహం జరిగిన కొద్దికాలనికే ఝాంగ్ చైనీస్ పీపుల్స్ వాలంటీర్ ఆర్మీలో చేరాడు. కొరియాతో చైనా భీకర యుద్ధం చేస్తున్న సమయం అది.
సరిగ్గా యుద్ధ విరమణ చర్చలు విఫలమవ్వడంతో కువోమింటాంగ్ దళాలు డాంగ్షాన్ ద్వీపంపై పెద్ద దాడి ప్రారంభించగా, అదనపు బలగాలను చైనా ఆర్మీ పంపించింది. ఆ సైనికుల్లో ఝాంగ్ కూడా ఒకడు. ఈ యుద్ధంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) విజయం సాధించింది, కానీ 1,200 మందికి పైగా సైనికుల్లో కొందరు మరణించగా మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అలా ఝూంగ్ 20 ఏళ్ల వయసులో మరణించాడు.
అతనికి పిల్లలు కూడా లేరు. అయితే ఆ సమయంలో అతడి తాలుకా ఒక్క ఫోటో కూడా కుటుంబ సభ్యుల వద్ద లేదు. దాంతో అతడి భార్య ఝావో ఒంటరిగా జీవించింది. అయితే ఝూంగ్ తల్లిదండ్రులు ఆమెను ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ఆమెకు ఐదుగురు పిల్లలు కలిగారు. అయితే హునాన్ అధికారుల మద్దతుతో, నాన్జింగ్ యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీకి చెందిన వాలంటీర్లు, నాటి యుద్ధకాలపు జ్ఞాపకాలను నమోదు చేసే ప్రాజెక్టు నిమిత్తం ఆయా మరణించిన సైనికుల కుటుంబాలను సందర్శించారు.

వృద్ధాప్యంలో ఉన్న బాధిత కుటుంబాల నుంచి నాడు అసువులు బాసిన ఆయా సైనికులతో ముడిపడి ఉన్న కుటుంబ జ్ఞాపకాలను, వారి ముఖ లక్షణాలను సేకరించారు. వాటి ఆధారంగా నాటి యుద్ధంలో వీరమరణం పొందిన లియుయాంగ్ ప్రాంత సైనికులు ఫోటోలను చిత్రించారు. వాటిని చూసి జాంగ్తో సహా ఆయా కుటుంబాలు విస్తుపోయాయి. తన దివంగత భర్తను యువకుడిగా ఉన్నప్పటి ఫోటోను చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఝావో.
నాడు యుద్ధం తన భర్తను దూరం చేసిందేమో గానీ అతడిపై ఉన్న ప్రేమ, జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. ఈ అద్భుతమైన సాంకేతికత తన భర్తను మళ్లీ ఈ చిత్రం రూపంలో మరోసారి కలుసుకునే అవకాశం ఇచ్చిందంటూ కన్నీటిపర్యంతమైందామె. అంతేగాదు ఆమె కుమార్తె సైతం ఫాదర్ ఝూంగ్ గోడలపై ఉండే వీరుడు కాదు..మా హృదయంలో సదా గౌరవించి గుర్తించుకునే ఆత్మీయ బంధువు అని గద్గద హృదయంతో అంది.
ఈ కథనం సోషల్మీడియాలో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు సైతం చరిత్ర పుస్తకాలలో అమరవీరుల జీవితాలు బహుశా కొన్ని పంక్తులకు మాత్రమే పరిమితం కావచ్చు, కానీ వారి కుటుంబాలు..ముఖ్యంగా భర్తలు కోల్పోయినవారు, కుమారులను పోగొట్టుకున్నవారి హృదయంలో ఎన్నటికీ పదిలంగానే ఉంటారు. యుద్ధం జస్ట్ ఈ లోకం నుంచే దూరం చేసిందే తప్ప ప్రేమించిన వారి హృదయాల నుంచి కాదు.
(చదవండి: "బాల్పాయింట్ పెన్" రూపొందించింది ఓ 'జర్నలిస్ట్’ అని తెలుసా..?)


