రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా లక్షలాదిమంది చిన్నారుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎన్నో జీవితాలను చిన్నా భిన్నం చేసింది. మరెన్నో కుటుంబాలను విఛ్చిన్నం చేసింది. అలాంటి తల్లీ బిడ్డ స్టోరీ వింటే కళ్లు చెమర్చక మానవు. ఉక్రెయిన్ యుద్ధంలో బందీగా మారిన లిలియా ప్రుటియన్ (55) ,ఆమె చిన్న కొడుకు దిమా జాహ్రేబయేవ్ను కాపాడుకోవడం చేసిన సాహసం, జీవన్మరణ పోరాటం యుద్ధ పరిస్థితులకు అద్దం పడుతుంది.
లిలియా ఉక్రెయిన్ సైన్యంలో మిలిటరీలో వైద్యురాలిగా పనిచేస్తున్న సమయంలో ఆమె తలకి బలమైన దెబ్బ తగలడంతో ఆమె వినికిడి శక్తి పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు 2022 ఫిబ్రవరిలో రష్యా దండయాత్ర ప్రారంభమైంది. ఐదార్ బెటాలియన్లో సేవలు అందిస్తున్న సమయంలో, రష్యన్ దళాలు ఆమెను బందీగా పట్టుకున్నాయి. అక్కడ రష్యన్ యుద్ధ ఖైదీలు ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను అనుభవించింది. తనను పట్టుకున్న సమయంలో, ఒక రష్యన్ సైనికుడు తనపై అత్యాచారం చేశాడని ఆమెచెప్పింది. ఉగ్రవాద ఆరోపణలతో లీలియా రెండున్నర సంవత్సరాల పాటు రష్యన్ బందీగా గడిపారు.
ఆమె రష్యన్ నిర్బంధ కేంద్రంలో ఉన్న సమయంలోనే ఆమె చిన్న కుమారుడు 17 ఏళ్ల డిమా తూర్పు ఉక్రెయిన్లోని రష్యన్ ఆక్రమిత ప్రాంతంలో చిక్కుకుపోయాడు.తల్లికి దూరమైన డిమా, ఆక్రమిత ప్రాంతంలో తీవ్ర అనారోగ్యం, ఒంటరితనంతో జీవితాన్ని సాగించాడు. తండ్రి ఇప్పటికే మరణించగా, పెద్ద కొడుకు ఉక్రెయిన్ సైన్యంలో, మధ్య కొడుకు రష్యా సైన్యంలో చేరిపోయారు. దీంతో డిమా తనను తాను పోషించుకునేందుకు ఒంటరి పోరాటమే చేశాడు.
చివరికి 2024 సెప్టెంబర్లో జరిగిన ఒక ప్రధాన ఖైదీల మార్పిడి కార్యక్రమంలో భాగంగా లిలియా విముక్తి లభించింది. ఉక్రెయిన్కు తిరిగి వచ్చిన తరువాత తన సుదీర్ఘ జైలు జీవితం వల్ల కలిగిన శారీరక, మానసిక గాయాల నుండి కోలుకోవడానికి ఆమె కైవ్ వెలుపల ఉన్న ఒక పునరావాస కేంద్రంలో చేరారు. అయితే, తన బిడ్డ తన పక్కన లేడనే బాధం వేధించేది. తన కుమారుడు లేని ఆ స్వేచ్ఛ ఆమెకు పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు.పైగా డిమాకు 20 ఏళ్లు నిండడంతో, అతన్ని బలవంతంగా రష్యన్ సైన్యంలోకి చేర్చుకునే ప్రమాదం ఉందే అందోళన తీవ్రమైంది. అందుకే తన ఆరోగ్యం క్షీణించినా లెక్క చేయకుండా మూడేళ్లపాటు దూరమైన తన కొడుకు డిమాను ఆక్రమిత ప్రాంతం నుండి కాపాడుకోవడానికి, యుద్ధ సరిహద్దులను దాటుతూ లిలియా అత్యంత ప్రమాదకర రక్షణ మిషన్ను రూపొందించింది.
ప్రమాదకరమైన రక్షణ ప్రణాళిక
డిమాను తప్పించడానికి లిలియా కీవ్ సమీపంలోని పునరావాస కేంద్రం నుంచే పనిచేయడం ప్రారంభించింది. అతన్ని రష్యన్ సైన్యంలోకి బలవంతంగా చేర్చుకుంటారనే భయంతో, ఆమె ఒక టాక్సీ డ్రైవర్కు డబ్బు చెల్లించి అతనికి తాత్కాలిక ఉక్రేనియన్ పాస్పోర్ట్ను రహస్యంగా అందేలా చేసింది. అలా 2025 ఫిబ్రవరిలో దిమా తన గ్రామం నుంచి బయలుదేరి, రష్యా, బెలారస్, పోలండ్ మీదుగా దాదాపు 1,740 మైళ్ల ప్రయాణం చేసి ఉక్రెయిన్లోని కీవ్ చేరుకున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత రైల్వే స్టేషన్లో శాశ్వత వేదనకు ముగింపు పలుకుతూ తల్లీకొడుకులు కలుసుకోవడం విశేషం. అయితే ఆమెకు మళ్లీ బందీగా ఉన్నట్లు ఆమెకు ఇప్పటికీ కలలు వస్తుంటాయట.
ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?
లిలియా ప్రూటియన్, ఆమె 20 ఏళ్ల కుమారుడు డిమా జహ్రెబాయెవ్లగురించి న్యూయార్క్ టైమ్స్ హృదయవిదారక కథనం ప్రచురించింది. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగంలోని 20 శాతం ప్రాంతంలో నెలకొన్న బాధాకరమైన కుటుంబ విభేదాలను వారి కథ ప్రతిబింబిస్తుంది. రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్లోని 20 శాతం భూభాగంలో అనేక కుటుంబాల కథే వారి ఈ ఎడబాటు. లక్షలాది మంది ఆ ఆక్రమిత భూభాగాల నుండి పారిపోయారు, ఇంకా లక్షలాది మంది వెళ్ళడానికి ఇష్టపడక లేదా వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు.
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య


