తిరువనంతపురం: స్టేట్ ప్లానింగ్ బోర్డులోని చీఫ్ లెవెల్ పోస్టుల భర్తీకి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై ‘విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో’ (విఏసిబి) చేత దర్యాప్తు జరిపించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. పీఎస్సీ అంతర్గతంగా జరుపుతున్న విచారణపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రాజ్యాంగబద్ధమైన పీఎస్సీపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించడంలో ఏవైనా చట్టపరమైన చిక్కులు ఉన్నాయా అనే కోణంలో హోంశాఖ న్యాయ సలహా కోరింది. తదుపరి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్లానింగ్ బోర్డు పరిధిలోని మూడు విభాగాల పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఉమ్మడి పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో 10 సమాధానాలను అసలు పరిశీలించనే లేదని పీఎస్సీ స్వయంగా అంగీకరించింది. అప్పటికే రెండు పోస్టులకు సంబంధించిన ర్యాంక్ జాబితాలు విడుదలై, ఇద్దరు అభ్యర్థులు విధుల్లో చేరిపోవడం గమనార్హం.
కేరళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో దాఖలైన ఒక ఫిర్యాదుతో ఈ ఘోర తప్పిదం వెలుగుచూసింది. దీంతో పరీక్ష రాసిన 200 మందికి పైగా అభ్యర్థుల సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి, ర్యాంక్ జాబితాలను సవరిస్తామని పీఎస్సీ ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీనితో పాటు ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేఏఎస్ వంటి పలు ఇతర నియామకాలపై కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందడంతో, వాటన్నింటినీ విజిలెన్స్ దర్యాప్తునకు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇది కూడా చదవండి: ఎన్కౌంటర్లో ఇద్దరు బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు హతం


