తిరువనంతపురం: కన్న తల్లిదండ్రులను చంపాడు ఓ యువకుడు. అంతేగాక, వారిని స్వర్గానికి పంపించానని వ్యాఖ్యలు చేశాడు. కేరళలోని ఇడుక్కిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రులను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఎళుకుంవయల్లోని తమ ఇంట్లో తన తండ్రి ఆంటోనీ (59) తల్లి వల్సమ్మ (55)ను హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో అజీష్ను పోలీసులు అరెస్టు చేశారు. అజీష్కు గతంలో మద్యం, మాదకద్రవ్యాల వినియోగం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో అతడు వ్యసన విముక్తి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కేంద్రం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి అతడు తన తల్లిదండ్రులను పలుసార్లు కత్తితో పొడిచిన తర్వాత, గాయాలతో ఉన్న ఆ దంపతుల వీడియోను చిత్రీకరించి ఓ బంధువుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ బంధువు పారిష్ పూజారికి, పొరుగువారికి సమాచారం అందించారు. వారు వెంటనే ఇంటికి చేరుకునే సరికి ఆ దంపతులు మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తొలుత తన తల్లిని తన పక్కన కూర్చోబెట్టి ప్రార్థన చేయాలని కోరాడు. ఆమె చేసిన ప్రార్థనతో సంతృప్తి చెందక ఆమెపై దాడి చేశాడు. ఆంటోనీ అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అజీష్ ఆయనపై కూడా దాడి చేశాడు.
అజీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత, “దేవుడి నుంచి ఫోన్ రావడంతో” తన తల్లిదండ్రులను “స్వర్గానికి పంపించానని” పోలీసులతో చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లోనే ఉన్న తన అమ్మమ్మకు మాత్రం ఎలాంటి హాని చేయలేదని పోలీసులు తెలిపారు.
అజీష్ అమ్మమ్మ మంచానికే పరిమితమై ఉన్నారు. ఆమెకు వినికిడి, చూపు సమస్యలు ఉన్నాయి. బంధువులు ఇంటికి చేరుకున్న తర్వాతే ఆమెకు ఘటన గురించి తెలిసిందని పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన నెడుంకండం పోలీసులు అజీష్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని న్యాయ రిమాండ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. అతడి సోదరుడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


