సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమీషనర్ , ఐఏఎస్ (IAS) అధికారి తుకారాం ముండే తన చర్యలతో రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా పరిశుభ్రత , ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లు, ఐస్క్రీమ్ పార్లర్లు, డెయిరీలు ,ఈ-కామర్స్ సంస్థలపై విస్తృతమైన దాడులతో కొరడా ఝళిపిస్తున్నారు. లైసెన్సుల రద్దు లాంటి చర్యలపై వస్తున్న విమర్శలను కూడా లెక్క చేయకుండా ఫుడ్ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు తక్షణమే చర్యలు తీసుకునే అధికారం FDAకి ఉందని ఆయన సమర్థించుకున్నారు.ఆహార కల్తీ, పరిశుభ్రత మరియు లైసెన్స్ లేని వ్యాపారాలపై చేపట్టిన వార్తల్లో నిలిచారు.ఇంతకీ ఎవరీ తుకారాం ముండే పదండి తెలుసుకుందాం.
ఒక స్నేహితుడితో కలిసి రెస్టారెంట్ విందుకెళ్లారు. అప్పుడే ఆ రెస్టారెంట్లో ఎఫ్డీఏ నిబంధనలు అమలు కావడం లేదని, తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన ఆహార భద్రతా లైసెన్స్ స్పష్టంగా కనిపించేలా ఉంచలేదని గమనించారు. అలాగే, అక్కడ తాగునీటి ఏర్పాట్ల గురించి కూడా ఆయన ఆరా తీశారు. ఆ తర్వాత స్నేహితుడు ఆర్డర్ చేసిన పనీర్ నిజమైందా? కృత్రిమైందా (అనలాగ్) అని ప్రశ్నించారు. చివరికి అది నకిలీది అని తేల్చారు.
అంతే 24 గంటల్లో నగరంలో వివిధ దుకాణాల్లో తనిఖీలు మొదలైనాయి.మెరుపు దాడులతో ప్రముఖ రెస్టారెంట్లు, ఐస్క్రీమ్ పార్లర్లు, ఇలా ఒక్కటనేమిటి జెప్టో, బ్లింకిట్కు చెందిన ఔట్లెట్లకు చుక్కలు చూపించారు. ఈ దాడుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, గడుపు తీరిన పదార్థాలు, బొద్దింకలు, బల్లులు, ఎలుకల మయంతో కూడిన వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. దీంతో గత రెండు నెలల్లో అధికారులు 3,100కు పైగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 165 లైసెన్సులు రద్దు చేయగా, 750కి పైగా సంస్థలకు లోపాలను సరిదిద్దుకోవాలంటూ నోటీసులు జారీ చేశారు.ఇటీవల నాగ్పూర్ మరియు సోలాపూర్లలో అక్రమ అబార్షన్ మందుల రాకెట్ను గుట్టురట్టు చేసి, ఆన్లైన్ పోర్టల్ ఇండియామార్ట్ (IndiaMART) డైరెక్టర్లతో సహా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో పలువర్గాలనుంచి ఆయనపై ప్రశంసలు లభించాయి.
మరోవైపు ఈ దాడులపై విమర్శలు కూడా చెలరేగాయి. అయితే తన ప్రజాదరణను పెంచుకోవడానికే ఈ ప్రచారం చేస్తున్నారన్న వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. ఇది తగిన చర్యగా అనిపించకపోతే, అసలు ప్రోపర్ యాక్షన్ (proportionate action) అంటే ఏమిటో నాకైతే తెలియదు," అని ముండే వ్యాఖ్యానించారు. ఇది తన గురించి కాదనీ, ఆహార రంగానికి, ఆహార భద్రతకు , ఆహార ప్రమాణాలకు సంబంధించిన విషయమని 'NDTV ప్రాఫిట్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్కు సర్ప్రైజ్ ఎమోషనల్ వీడియో
ఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?
చట్టాలను కచ్చితంగా అమలు చేసే అధికారిగా పేరుపొందిన ఆయన, రాజకీయాల్లోకి వస్తారా అని అడిగిన ప్రశ్నకు "ఖచ్చితంగా రాను (Absolutely not)" అని స్పష్టం చేశారు. తన లాంటి ముక్కుసూటి, నిజాయితీ గల వ్యక్తులకు రాజకీయాలు సరిపడవని పేర్కొన్నారు. కొందరు తనను "అహంకారి" అని పిలుస్తారని, అయితే ముక్కుసూటితనానికి మరియు అహంకారానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుందని, అది తన సహజ సిద్ధమైన నైజమని తెలిపారు. 21 ఏళ్ల కెరీర్లో 25 సార్లు బదిలీలు అయ్యాయనీ అయినా తన నిబద్ధతలో మార్పులేదని చెప్పుకొచ్చారు. ఎక్కువ బదిలీలు జరిగితే సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావడానికి మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయని ముండే చెప్పడం గమనార్హం.
ఇదీ చదవండి: రెండు రోజుల్లో బర్త్డే : 11 నెలల చిన్నారిని యమునలో విసిరేసిన తండ్రి


