భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీకి సమీపంలో నిలబడిన ఒక మహిళా సైనికాధికారి ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఎవరామె అంటే..
ఆ ఆధికారిణి కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్. ఆమె భారత సైన్యంలో ఒక కమిషన్డ్ అధికారిణి. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో, ఎర్రకోట ప్రాకారాలపై ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు ఆయనకు సహాయపడే ఒక నిర్దిష్ట లాంఛనప్రాయ బాధ్యతను ఆమెకు అప్పగించారు.
ఎర్రకోటలో ఆమె పాత్ర ఏంటంటే..
ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైనిక నియమావళి ప్రకారం జరుగుతాయి. ఇందులో గౌరవ వందనంగా(గార్డ్ ఆఫ్ ఆనర్) నుంచి జాతీయ పతాక వందనం (నేషనల్ ఫ్లాగ్ గార్డ్) వరకు ప్రతిదానికీ కేటాయించిన అధికారులు బాధ్యత వహిస్తారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, జెండాను ఎగురవేసే క్షణంలో నేరుగా సహాయం చేయడమే కెప్టెన్ చౌహాన్ పని. ఈ కార్యక్రమం, స్వదేశీ 105mm లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించి 1721 ఫీల్డ్ బ్యాటరీ కాల్చిన 21-గన్ సెల్యూట్తో నిర్వహిస్తారు.
అందరి దృష్టిని ఆకర్షించడానికీ రీజన్..
జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీ పక్కనే కనిపించడంతో అందరి దృష్టిని ఆమె అమితంగా ఆకర్షించింది. పైగా ఈ దృశ్యం నారీ శక్తి లేదా మహిళా సాధికారతపై భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది. అలాగే ఇటీవల సంవత్సరాలలో భారత సాయుధ దళాలలో, పోరాట విధుల నుంచి భారతదేశపు అత్యంత ఎత్తైన పర్వత సరిహద్దులలోని పోస్టింగ్ల వరకు మహిళా అధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ధోరణికి అనుగుణంగా ఉంది.
(చదవండి: Independence Day 2026: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!)


