ఆగస్టు 14, 1947 అర్థ రాత్రి స్వాతంత్ర్య వచ్చిందని అందరికి తెలుసు. కానీ ఆ రోజు అర్థరాత్రి స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తున్న తరుణంలో 'విధితో ఒప్పందం' అనే జవహర్లాల్ నెహ్రూ ప్రసంగమే హైలెట్గా నిలిచింది. కానీ ఆ రాత్రి ఆయన మాటల కంటే ఒక మహిళా గాత్రం అందరి చెవుల్లో పడింది. నెహ్రూ ప్రసంగంలోని ఒక్క వాక్యం కూడా వినిపించక మునుపే అంతా ఊపిరి బిగబెట్టుకుని ఆసక్తితో ఎదురుచూస్తున్న సభలో ఒక మహిళ లేచి 'వందేమాతరం'లోని తొలి చరణాన్ని ఆలపించారు. ఆ వనిత ఎవరంటే..
ఆమెనే సుచేతా కృపలానీ. ఆ ఒక్క క్షణం పాటు, ఆ నవభారతదేశపు స్వరం ఆమెదే అయ్యింది
పోరాట మార్గాన్ని ఎంచుకున్న ఉపాధ్యాయిని
కృపలానీ మొదట విప్లవకారిణిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించలేదు. 1908లో జన్మించిన ఆమె, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్రను అభ్యసించి, ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చరిత్రను బోధించేవారు . అక్కడే ఆమెకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆచార్య జె.బి. కృపలానీతో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహానికి దారితీసింది. అయితే ఆ వివాహం కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా జరిగింది.
ఆ తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం ఆమెను క్రమంగా బోధనా వృత్తికి దూరం చేసింది. 1942 నాటి 'క్విట్ ఇండియా' ఉద్యమ సమయంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లి రహస్యంగా ప్రతిఘటనను నిర్వహించారు. అరుణా అసఫ్ అలీ, రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన ఆమెను 1944లో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. పోరాటంలో మహిళలు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకూడదని దృఢ సంకల్పంతో, 1940లోనే ఆమె కాంగ్రెస్ మహిళా విభాగాన్ని స్థాపించారు.
పదిహేను మందిలో ఒకరు
ఇంకా స్వాతంత్ర్యం రాని దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1946లో రాజ్యాంగ పరిషత్ (Constituent Assembly) ఏర్పాటైనప్పుడు, కృపలానీ అందులో సభ్యురాలిగా ఎంపికయ్యారు. దాదాపు మూడు వందల మంది సభ్యులున్న ఆ సభలో ఉన్న పదిహేను మంది మహిళల్లో ఆమె ఒకరు. సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్ వంటి ప్రముఖులతో కలిసి ఆమె ఆ సభలో కూర్చున్నారు. చర్చలలో, ఆమె ఆర్భాటంగా కాకుండా ఆచరణాత్మకంగా వ్యవహరించారు.
మహిళల హక్కులు, సమానత్వం కొత్త ప్రభుత్వం ఏ రూపంలో ఉండాలనే విషయాలపై మాట్లాడారు. 1947లో, దేశ విభజన బెంగాల్ను అట్టుడికిస్తున్నప్పుడు, ఆమె గాంధీతో కలిసి నోవాఖలీకి ప్రయాణించి, అల్లర్ల బాధితుల మధ్య పనిచేశారు. ఆనాడు స్వాతంత్య్రాన్ని కమ్ముకున్న ఆ హింస నడిబొడ్డులోకి ఆమె అడుగుపెట్టారు.
అర్ధరాత్రి గీతం
ఆమె జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం స్వాతంత్య్రానికి ముందు రోజు వచ్చింది. రాజ్యాంగ సభ అధికారిక రికార్డు ఆ క్రమాన్ని యథాతథంగా భద్రపరుస్తుంది. అజెండాలోని మొదటి అంశం వందేమాతరం మొదటి చరణాన్ని ఆలపించడం అని రాష్ట్రపతి ప్రకటించగా, సుచేతా కృపలాని దానిని ఆలపిస్తుండగా సభ వినడానికి లేచి నిలబడింది. ఆ తర్వాత సమావేశంలో ఆమె 'సారే జహాన్ సే అచ్చా' ప్రారంభ పంక్తులు, 'జన గణ మన' మొదటి చరణాన్ని ఆలపించారు.
అప్పుడే నెహ్రూ మాట్లాడటానికి లేచారు. 'వందేమాతరం' అనే నినాదం దశాబ్దాలుగా స్వాతంత్ర్య పోరాటానికి యుద్ధ నినాదంగా నిలిచింది. ఆ స్వాతంత్య్రాన్ని సాధించిన స్త్రీపురుషుల ముందు, తన స్వంత స్వరంతో ఆ నినాదాన్ని స్వేచ్ఛా భారతదేశంలోకి తీసుకువెళ్లే బాధ్యత ఆమెపై పడింది.
ఆమె స్వరం ఇప్పటికీ మోస్తున్నది
ఆమె మిగిలిన జీవితం ఆ ప్రారంభానికి అనుగుణంగానే సాగింది. ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1963లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే భారతదేశ రాష్ట్రానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారామె. ఆమె హాయంలో ఉన్న తీవ్రమైన ఉద్యోగుల సమ్మె, ఆహార సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, ఆ తర్వాత పదవి నుంచి వైదొలిగారు.
అయినప్పటికీ, ఆమె గానమే నిలిచి ఉంది. తరచుగా కొద్దిమంది మహనీయుల మాటల ద్వారా తన స్వేచ్ఛను గుర్తుచేసుకునే దేశం. వాస్తవానికి ఒక మహిళ మాటలు వింటూ స్వేచ్ఛవాయువులను పీల్చుకుంది దేశం. అప్పటి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం నాడు వందేమాతరం గీతం ఆలపించిన ప్రతిసారీ, ఆనాడు స్వతంత్ర నవ భారతదేశంలో ఆమె ఆలపించిన తొలి గీతమే ప్రతిధ్వనిస్తుంటుంది కదూ..!.


