మరో ఉద్యమం ప్రారంభించిన దీప్కే.. ఇక వీళ్ల పని ఏమైపోతుందో | CJPs Abhijeet Dipke launches School Thik Karo campaign on I Day | Sakshi
Sakshi News home page

మరో ఉద్యమం ప్రారంభించిన దీప్కే.. ఇక వీళ్ల పని ఏమైపోతుందో

Aug 15 2026 8:36 PM | Updated on Aug 15 2026 9:04 PM

CJPs Abhijeet Dipke launches School Thik Karo campaign on I Day

హింగోలి (మహారాష్ట్ర): కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కొరత ఉందని ఆయన ఆరోపించారు. పగిలిన కిటికీలు, పూడుకుపోయిన మరుగుదొడ్లు, కూర్చునేందుకు సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.

తన గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన తర్వాత దీప్కే ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. ఎక్స్‌లో దీప్కే స‍్పందిస్తూ.. “స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాలు లేవు. నేను మా గ్రామ సర్పంచ్‌తో మాట్లాడాను. వారంలోపు ఈ సమస్యలన్నింటినీ పంచాయతీ పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మనమంతా కలిసి చర్యలు తీసుకుంటే మార్పు సాధ్యమే’’ అని చెప్పారు.

మరో పోస్టులో పగిలిన కిటికీల వీడియోను పోస్ట్‌ చేసిన దీప్కే.. “మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్యానర్లతో ప్రభుత్వ పాఠశాలలోని పగిలిన కిటికీలను కప్పేస్తున్నారు” అని ఆరోపించారు. పాఠశాలలో పూడుకుపోయిన మరుగుదొడ్లను చూపించే మరో వీడియోను కూడా దీప్కే పంచుకున్నారు. “ఈ మరుగుదొడ్డిని ఏ పిల్లాడు ఎలా ఉపయోగించాలి?” అని రాశారు.

పాఠశాల మరుగుదొడ్లకు నీటి సరఫరా లేదని, పలు కిటికీలు పగిలిపోయాయని, విద్యార్థులకు సరిపడా బెంచీలు లేవని దీప్కే ఆరోపించారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 4 బెంచీలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో తదుపరి దశలో మహారాష్ట్రలోని ఇతర తాలూకాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తానని దీప్కే తెలిపారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలపై తల్లిదండ్రులు సామాజిక తనిఖీలు నిర్వహించాలని ఆయన కోరారు.

ఈ ప్రచార ప్రారంభానికి ముందు ఈ వారం ప్రారంభంలో జంతర్‌ మంతర్‌ ‘సీజన్‌ 2’ను సీజేపీ ప్రారంభించబోతోందని దీప్కే ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఇతర కీలక డిమాండ్లపై హామీలు రావడంతో 37 రోజుల పాటు సాగిన జంతర్‌ మంతర్‌ నిరసనను జూలై 25న విరమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా.. పాఠశాలల దుస‍్థితికి కారణమైన వారి తక్కురేగ్గొట్టనుంది సీజేపీ.  
 
స్వాతంత్య్ర దినోత్సవం వేళ సీజేపీకి షాక్‌
కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను శనివారం ఉదయం తొలగించారు. అయితే ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ తమ గొంతును అణచివేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ చర్య అని సీజేపీ ఆరోపించింది.

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనకు నాయకత్వం వహించిన సీజేపీ.. తమ ఖాతాను విజయవంతంగా తిరిగి పొందినట్లు తెలిపింది. “సీజేపీని వ్యతిరేకించే వారు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకుని మా గొంతును అణచివేయడానికి ప్రయత్నించడం ఎంత అవమానకరం. ఇలాంటి పిరికిపంద చర్యలకు మేము భయపడము” అని ఆ పార్టీ ఒక పోస్టులో పేర్కొంది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే కూడా ఖాతా తొలగింపుపై స్పందించారు. “కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించారు. పిరికిపందలు” అని అన్నారు. ఆ తర్వాత అదే రోజు ఖాతాను పునరుద్ధరించినట్లు సీజేపీ తెలిపింది.

ఇటీవల సీజేపీ చేపడుతున్న వరుస ప్రచారాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ పాఠశాలల పరిస్థితిపై అవగాహన కల్పించడం, విద్యార్థులు, విద్యకు సంబంధించిన సమస్యలపై నిరసనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి.

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు యువతకు సంబంధించిన సమస్యలను జాతీయ స్థాయి చర్చలోకి తీసుకురావాలని సీజేపీ ప్రయత్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దేశ యువతను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతూ సీజేపీ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. నిరుద్యోగం, విద్య, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తింది.

ఇటీవలి నెలల్లో సీజేపీ విద్య, పోటీ పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, విద్యార్థులను ప్రభావితం చేస్తున్న ఇతర సమస్యలపై నిరసనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో దీప్కేకు దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement