శ్రీనగర్: సామాజిక మాధ్యమం ‘స్నాప్చాట్’ పరిచయంతో సరిహద్దులు దాటి ప్రేమికురాలిని కలవడానికి వచ్చిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యువకుడిని భారత సైన్యం తిరిగి పాకిస్తాన్కు అప్పగించింది. అధికారుల కథనం ప్రకారం.. పీఓకేలోని ముజఫరాబాద్ జిల్లాకు చెందిన జీషాన్ మీర్, జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ఇరామ్ మజీద్ అనే యువతి 2025 మే నెల నుండి స్నాప్చాట్లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. ప్రేమికురాలిని కలుసుకోవాలనే ఉద్దేశంతో జీషాన్, ఈ ఏడాది జూన్ 1న ఉరి సెక్టార్లోని సిలికోట్ ప్రాంతంలో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడు.
ఆ సమయంలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారత సైన్యం అతడిని గుర్తించి అదుపులోనికి తీసుకుంది. అనంతరం ప్రాథమిక విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. నెల రోజుల పాటు భద్రతా సంస్థల దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత, మానవతా దృక్పథంతో అతడిని శనివారం (జూలై 4న) కమన్ అమన్ సేతు సరిహద్దు వద్ద పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు అప్పగించినట్లు సైన్యం వెల్లడించింది. విచారణ సమయంలో జీషాన్ పట్ల అత్యంత గౌరవంతో, నిష్పక్షపాతంగా వ్యవహరించామని అధికారులు తెలిపారు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీమా హైదర్ ఉదంతాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుకు తెచ్చింది.
ఇది కూడా చదవండి: మరో ‘పరీక్ష కుంభకోణం’: సమాధానాలు దిద్దకుండానే ఉద్యోగాలు!


