పట్నా: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. బీహార్లోని ప్రతిష్టాత్మక బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూలై 30న జరగనున్న ఉపఎన్నికలో జన్ సూరజ్ పార్టీ తరపున ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
శనివారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరిగింది. గతంలో నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి అగ్రనేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రశాంత్కిశోర్.. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా వ్యూహాత్మక తప్పిదం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో, బీజేపీకి బలమైన కోటగా భావించే బాంకీపూర్ స్థానాన్ని ఎంచుకోవడం ద్వారా పీకే తన రాజకీయ విశ్వసనీయతను నిరూపించుకోవాలని భావిస్తున్నారు.
ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన నితిన్ నవీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపాధి, విద్య, వలసలు వంటి స్థానిక సమస్యలపై పీకే ఇక్కడ ప్రచారం చేయనున్నారు. ఇక్కడ గెలిస్తే బీహార్ రాజకీయాల్లో ఆయన కీలక ప్రత్యామ్నాయంగా ఎదుగుతారని, ఒకవేళ ఓడిపోయినా బీజేపీ గడ్డపై పోరాడారనే గుర్తింపు లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


