న్యూ ఢిల్లీ: దేశంలో అత్యవసర వైద్య సేవలను మెరుగుపరిచేందుకు, రోగుల భద్రతను పెంపొందించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అంబులెన్స్ ప్రమాణాలలో కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్)-125 నిబంధనలలో మార్పుల కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ ప్రతిపాదనల ప్రకారం అనారోగ్యంతో ఉన్న లేదా నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సురక్షిత రవాణా కోసం ప్రత్యేకంగా ‘నియోనాటల్ రోడ్ అంబులెన్స్’లను ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రమాదాలు, అత్యవసర సమయాల్లో ఒకేసారి ఎక్కువ మంది రోగులను తరలించేందుకు వీలుగా ‘మల్టీ-స్ట్రెచర్ రోడ్ అంబులెన్స్’లను అందుబాటులోకి తేనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో వాహనాల్లో చిక్కుకుపోయిన బాధితులను వెలికితీసేందుకు వీలుగా క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి కేటగిరీ అంబులెన్స్లలో రెస్క్యూ పరికరాలను తప్పనిసరి చేయనున్నారు.
మరో ప్రధాన మార్పుగా ఎలక్ట్రిక్ అంబులెన్స్లలో వైద్య పరికరాల నిర్వహణ కోసం ప్రత్యేక పవర్ సోర్స్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రయాణంలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగదు. ప్రజల సలహాలు, సూచనల అనంతరం ఈ సవరణలు తుది నోటిఫికేషన్ ద్వారా అమలులోకి రానున్నాయి.


