చింతూరు: పోలవరం జిల్లా చింతూరులో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన చిన్నారి ప్రాణం ఆగింది. చింతూరు మండలం పెద్ద శీతనపల్లి గ్రామానికి చెందిన చోడి పాపయ్య కూతురు చోడే లాస్య (4) అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారికి వైద్యులు మలేరియాగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వెళ్లాలని సూచించారని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు.
తమ వద్ద ఆర్థిక స్థోమత లేకపోవడంతో డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఆలస్యం కావడంతో ఆస్పత్రిలో చిన్నారి మృతి చెందిందని వారు వాపోయారు. చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఎదుట చిన్నారి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో శుభమ్ నొఖ్వాల్ బాధిత కుటుంబంతో మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.


