ఇవాళ ఐఐటీ, ఐఏఎం చేసిన వాళ్లు ఏం రేంజ్లో ప్యాకేజ్లు తీసుకుంటారో తెలిసిందే. ఎవరి నోట చూసినా.. ఇన్నేసి లక్షలు, కోట్లు అని మాత్రమే వింటుంటాం. అలాంటిది అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తే..ఇంక ఏ రేంజ్లో జీతం ఉంటుంతో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది అతడు ఎంత జీతం తీసుకున్నాడో వింటే మతిపోవడం ఖాయం. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట షేర్ వైరల్గా మారింది.
సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అజయ్ నానావతి ఆ పోస్ట్ని షేర్ చేశారు. ఆయన లింక్డ్ఇన్ పోస్ట్లో తాను అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ చదివి భారతదేశానికి తిరిగి రాగానే తనను నియమించుకోవడానికి ఎన్నో కంపెనీలు ఎగబడతాయని అనుకున్నానంటూ రాశారు. కానీ తన మొదటి నియామక పత్రాన్ని పంచుకుంటూ..1977లో టాటాలో తన మొదటి ఉద్యోగ జీతం కేవలం రూ. 960లు అని చెప్పారు.
అది తెలుసుకుని బహుళజాతి సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న తన తండ్రి సైతం అవాక్కయ్యరని అన్నారు. కానీ ఆయన ఆ టాటా జాబ్ ఆఫర్ని అంగీకరించమనే ప్రోత్సహించారని తెలిపారు. అదే సమయంలో తనకు పలు కంపెనీల నుంచి అంతకుమించి ఎక్కువ జీతాలిస్తామని ఆఫర్లు కూడా వచ్చాయన్నారు. అయితే శాలరీ కంటే బాంబే హౌస్లో పనిచేసే అవకాశం ముఖ్యం కావడంతో తాను టాటానే ఎంచుకున్నట్లు వెల్లడించారు.
కానీ ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే బహుశా అదే అత్యంత తెలివైన కెరీర్ నిర్ణయమని అన్నారు నానావతి. సామర్థ్యాన్ని అనుసరించే జీతం వస్తుందనేది తన నమ్మకమని నొక్కిచెప్పారు. అయితే ప్రస్తుత నియామకాల వాతావరణంలో చాలామంది యువ నిపుణులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కన్సల్టింగ్, ప్రైవేట్ ఈక్విటీ తదితర రంగాలను ముందుగా జీతం అనే కోణంలోనే చూస్తున్నారని నానావతి అన్నారు. అయితే, ఆయన మాత్రం కెరీర్ తొలినాళ్లలో సంపాదించడంపై కంటే నేర్చుకోవడంపైనే ఫోకస్ పెట్టమని అన్నారు. అ
ధిక జీతం కోసం వెంపర్లాడే ముందు, యువ నిపుణులు తమ రంగంలో లోతైన నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అసాధారణమైన నాయకులతో కలిసి పనిచేయాలని, సవాలుతో కూడిన వాతావరణాలను కోరుకోవాలని, సరైన విచక్షణ , విశ్వనీయతను పెంచుకోవాలంటూ తన పోస్ట్ని ముగించారు. అయితే ఈ పోస్ట్తో నెటిజన్లు ఏకభవించడమే గాక, అనుభవజ్ఞులైన ఉద్యోగులు సైతం జీతభత్యాలకు వాల్యూ ఇవ్వడం కంటే జిజ్ఞాస, అభ్యాసం, సంస్థాగత సంస్కృతి, లక్ష్యం, విలువలే ముఖ్యమని అన్నారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా ఆరోగ్యం, సంపద రెండూ కాలక్రమేణ పెరుగుతాయని అన్నారు.
(చదవండి: 97 ఏళ్ల వయసులో ఆకాశంలోకి దూసుకెళ్లి..గిన్నిస్ రికార్డు!)


