అంబులెన్సులకు ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలు
విఫలమైతే రూ. పదివేల జరిమానా
తిరస్కరించినా, తగిన సేవలు అందించకున్నా జరిమానా
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల బాధితులకు సత్వర చికిత్స అందించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పది నిమిషాల్లోపు ప్రమాద స్థలానికి చేరుకోవాలని, లేదంటే రూ.పదివేల జరిమానా విధిస్తామని అంబులెన్సు సరీ్వసులను హెచ్చరించింది.
ఈ నిబంధన ప్రమాద స్థలికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అంబులెన్సులకు వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా... అంబులెన్సులు టికెట్ను అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రులకు తీసుకు రావాలని స్పష్టం చేసింది.
ఈ గడువును ఉల్లంఘించినా ఒక్కో ఘటనకు రూ.పదివేల జరిమానా తప్పదని తెలిపింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రమాద స్థలం పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే దూరాన్ని బట్టి చేరుకోవాల్సిన సమయాన్ని పెంచుతామని జీపీఎస్ డేటా/ఐఎంఎస్ కేర్ డ్యాష్బోర్డ్ ద్వారా ధ్రువీకరిస్తామని ఎన్హెచ్ఏఐ వివరించింది.
ఎన్హెచ్ఏఐ పరిధిలో సుమారు 50,000 కిలోమీటర్ల రహదారులను కవర్ చేస్తూ దాదాపు 3,000 అంబులెన్స్లు, 1,000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు టికెట్ తిరస్కరించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఎన్హెచ్ఏఐతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అంబులెన్సులు అన్ని పరికరాలు, మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపింది. లేకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది.


