సాక్షి, న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ ఫుడ్పై లేబుల్స్ వ్యవహరంలో సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై (Packaged Food Products) చక్కెర, ఉప్పు , సంతృప్త కొవ్వుల (Saturated Fat) పరిమాణం ఎక్కువగా ఉంటే హెచ్చరిక లేబుళ్లను (Front-of-pack warning labels) నిబంధనల ప్రకారం ముద్రించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, FSSAI (భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ)కి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. "మీరు ఈ పని చేయకపోతే, మేమే ఆర్డర్ ఇస్తాం" అని అత్యున్నత న్యాయస్థానం అల్టిమేటం జారీ చేసింది. దీనిపై తుది నిర్ణయం తెలపడానికి కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది.
హెచ్చరిక లేబుళ్ల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేదంటే కోర్టు స్వయంగా తగు ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేసింది. పిల్లలు, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. కేవలం సాధారణ పోషకాహార పట్టిక సరిపోదని, స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.
ఈ సందర్బంగా కార్పొరేట్ ఒత్తిళ్లపై అత్యున్నత కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ ఇండస్ట్రీ వ్యతిరేకిస్తుందనే కారణంతో ఈ లేబుళ్ల ప్రక్రియను ఆలస్యం చేయడంపై జస్టిస్ జె.బి. పారడీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కార్పొరేట్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గుతున్నారా అని ప్రశ్నించింది. ప్రజా ఆరోగ్యం ముఖ్యమని తెలిపింది.ఇది దేశ పౌరుల, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని, వ్యాపార వర్గాల ప్రయోజనాల కంటే వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమని కోర్టు పేర్కొంది. లేబుల్ మీద హెచ్చరికలు ఉంచడం అంటే అమ్మకాలను ఆపడం కాదని, తాము ఏమి తింటున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజెప్పడమేనని తేల్చి చెప్పింది.
కేంద్రం వాదనను తోసిపుచ్చిన కోర్టు
సాంప్రదాయ భారతీయ పిండివంటలు/స్నాక్స్ (ఉదాహరణకు నమకీన్ వంటివి) పై ఎరుపు రంగు హెచ్చరిక మార్కులు పడతాయని, విదేశీ ప్రమాణాలను ఇక్కడ నేరుగా అమలు చేయడం కష్టమని కేంద్రం తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనను తిరస్కరించిన కోర్టు "భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోవాలా?" అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. లేనిపక్షంలో తదుపరి విచారణలో కోర్టు నేరుగా ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: చాట్జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్
కాగా ప్యాకెట్ల ముందు భాగంలోనే (Front-of-Pack) అనారోగ్యకరమైన అంశాల (ఉప్పు, చక్కెర, ఫ్యాట్) సమాచారాన్ని స్పష్టమైన గుర్తులు లేదా హెచ్చరికల రూపంలో ముద్రించాలని దాఖలైన పిటీషన్పై విచారించిన ఈ సుప్రీం తాజా వ్యాఖ్యలు చేసింది. కేవలం సాధారణ పోషకాహార పట్టిక సరిపోదని, స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: మాల్యా కేసు : బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు


