ఏది గొప్పో తేల్చే విచారణ అక్టోబరు ఆరు నుంచి చేపట్టనున్న ఏడుగురు సభ్యుల ధర్మాసనం
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల ప్రత్యేక హక్కుల పరిధికి సంబంధించిన నిబంధనల అర్థాన్ని, అవి భావ ప్రకటన స్వేచ్ఛపై చూపే ప్రభావంపై ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం అక్టోబరు ఆరవ తేదీ నుంచి విచారించనుందని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. 2003లో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కె.కాళిముత్తు సభా హక్కుల ఉల్లంఘన, ధిక్కరణలను కారణాలుగా చూపుతూ ఆరుగురు జర్నలిస్టుల అరెస్ట్కు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ అంశంపై ఆ విలేకరుల్లో ఒకరైన ఎన్.రవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం కలి్పంచిన భావ ప్రకటన స్వేచ్ఛను శాసనసభకు ఉన్న హక్కులు అధిగమిస్తాయా? అన్న ప్రశ్న సుప్రీంకోర్టు ముందు ఉంచారు. సుప్రీంకోర్టు 2003 డిసెంబరులో జర్నలిస్టుల అరెస్టుపై స్టే విధించి... భావ ప్రకటన స్వేచ్ఛకు, శాసన సభ్యుల ప్రత్యేక హక్కులకు సంబంధించి న్యాయపరమైన ప్రశ్నలు చాలా ఉన్నాయని గుర్తిస్తూ విషయాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. 2004లో ఈ బెంచ్ కేసును విచారించి గతంలోనే ఈ అంశంపై భిన్నమైన తీర్పులు ఉన్న విషయాన్ని ప్రస్తావించింది.
ఒకానొక తీర్పు ప్రాథమిక హక్కులే చెల్లుబాటవుతాయని చెబితే 1965 నాటి తీర్పు ప్రకారం శాసనసభ ప్రత్యేక హక్కులే ఉన్నతాధికారం కలిగినవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేసును విస్తృత ధర్మాసనం విచారణకు నివేదించింది. తాజాగా ఈ అంశాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అక్టోబరు ఆరవ తేదీ నుంచి మొదలవుతుందని తెలిపింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ తెలిపారు. ఈ సందర్భంగానే రాష్ట్ర శాసనసభలు సేల్స్ ట్యాక్స్పై అదనపు సుంకం విధించే అధికారానికి సంబంధించిన మరో అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సెపె్టంబర్ 22 నుంచి విచారిస్తుందని సీజేఐ తెలిపారు.


