సాక్షి,బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని బెంగళూరులో ఆహార భద్రతా అంశంలో ముమ్మర తనిఖీలు కఠిన, చర్యలు సాగుతున్నాయి. కర్ణాటక ఆహార భద్రత మరియు ఔషధ పరిపాలన సంస్థ (FSA) నగరంలోని ఫైవ్-స్టార్ హోటళ్లు, ప్రీమియం రెస్టారెంట్లు, పబ్లు, గిడ్డంగులు, జెప్టో (Zepto), జొమాటో (Zomato) వంటి క్విక్-కామర్స్ వేర్హౌస్ల వరపెద్ద ఆహార సరఫరా గొలుసుల వంటి ఆహార సేవా వ్యవస్థ అంతటా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ఇటీవల ఫైవ్-స్టార్ హోటళ్లలో జరిపిన తనిఖీలలో గడువు ముగిసిన పాలు, కుళ్ళిన మాంసం, బూజు పట్టిన కూరగాయలు, బొద్దింకలు వంటి విషయాలు బయటపడ్డాయి.
అలాగే హోస్కోట్లోని జెప్టో గిడ్డంగిపై జరిపిన దాడిలో అపరిశుభ్రమైన పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయా హోటల్స్లో అపరిశుభ్రత, నిర్వహణ తీరుపై అధికారులు కనుగొన్న విషయాలు, దాడుల తర్వాత ఏమి జరుగుతుందనే విషయాలపై ఎన్డిటివితో ప్రత్యేకంగా మాట్లాడారు.
షాకింగ్ విషయాలు
బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటళ్లు, ప్రీమియం రెస్టారెంట్లు, జెప్టో, జొమాటో లాంటి క్విక్-కామర్స్ వేర్హౌస్ల వరకు ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కుళ్ళిపోయిన మటన్, గడువు ముగిసిన చికెన్, పాలు, బూజు పట్టిన పండ్లు, పదేపదే వాడి, నల్లగా మారిపోయిన వంటనూనె లాంటి షాకింగ్ విషయాలను అధికారులు గుర్తించారు. ఒక పబ్లో మరుసటి రోజు తయారీ తేదీ వేసి ఉన్న చికెన్ ప్యాకెట్ కూడా దొరికింది.
ఆరోగ్య మంత్రి ప్రకటన
ఒక హోటల్ పదేపదే వాడి, బాగా నల్లబడిన వంట నూనెను ఉపయోగిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఆ నూను ఎంత నల్లగా ఉందంటే, ఆ స్థితిలో ఉన్న నూనెను వీధి వ్యాపారులు కూడా వాడకపోవచ్చని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేవలం సంస్థలను శిక్షించడం తమ లక్ష్యం కాదని, వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించి, పరిశుభ్రత పాటించడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి వారు ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసేలా చూడటమే తమ పని అని మంత్రి యు.టి. ఖాదర్ చెప్పారు. ప్రజల ఆరోగ్య భద్రత, ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిశ్రమకు గట్టి సందేశం పంపడానికే ముందుగా పెద్ద హోటళ్ల నుంచే ఈ తనిఖీలు ప్రారంభించినట్లు చెప్పారు. తమ వద్ద అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పుకునే హోటళ్లు... వినియోగదారుల్లో నమ్మకం కలిగించేందుకు తమ వంటశాలలు (Kitchens), స్టోర్రూమ్లను బహిరంగంగా చూపించాలని లేదా స్క్రీన్ల ద్వారా ప్రదర్శించాలని మంత్రి సవాలు విసిరారు.
ఇదీ చదవండి: జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...!
ఇందిరా క్యాంటీన్లు, లక్ష్యాలు
ప్రభుత్వ పరిధిలోని 'ఇందిరా క్యాంటీన్ల'ను కూడా తనిఖీ చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో PGలు, హాస్టళ్లు, పెళ్లిళ్లకు ఆహారం అందించే కేటరింగ్ ఏజెన్సీలపై కూడా దాడులు ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు, మూసివేతలతోపాటు, లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా, ఆహార భద్రతా నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: నిబంధనలు గాలికి,అపరిశుభ్రత : జెప్టోకు భారీ షాక్


